పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై కేంద్రం మల్లగుల్లాలు: క్రూడాయిల్ ధర.. అంచనాలకు అందట్లేదుగా
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలో అస్థిరత కొనసాగుతోంది. అంచనాలకు ఏ మాత్రం అందట్లేదు. ఒక రోజు భారీగా తగ్గిందనుకున్న క్రూడ్ ధర.. ఆ మరుసటి రోజుకే అదే రేంజ్లో బౌన్స్ బ్యాక్ అవుతోంది. అనూహ్యంగా పెరుగుదల బాట పడుతోంది. కొద్దిరోజులుగా క్రూడాయిల్ మార్కెట్లో ఇదే పరిస్థితి నెలకొంది. రేట్లు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ దాన్ని బిగబట్టేలా చేస్తోంది.
110 డాలర్లకు చేరువగా..
మరోసారి క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 104.09 డాలర్లు పలుకుతోంది. ఒక దశలో ఇది 106 డాలర్ల ను దాటింది. అటు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ రేటు ఫర్వాలేదనిపించేలా ఉంటోంది. బ్యారెల్ క్రూడాయిల్ రేటు 98.30 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయింది. ఆగస్టు 1వ తేదీన ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో మార్కెట్లో చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు గందరగోళానికి దారి తీస్తోన్నాయి.
ఇవ్వాళ్టి కొత్త రేట్లివే..
చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.
విశాఖపట్నంలో..
కోల్కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.
వ్యాట్పై..
అహ్మదాబాద్లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.
తగ్గింపు వైపు చూడని స్టేట్స్
రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.