వాహనదారులకు ఊరట: అక్కడ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 తగ్గింపు: కొత్త రేట్లు ఇలా
ముంబై: అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. చాలాకాలం తరువాత 100 డాలర్ల దిగువకు చేరింది. 100 డాలర్లకు దిగవనే ట్రేడింగ్ అవుతోంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ క్రూడాయిల్ 99.28 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లోనూ ఈ ధరలో మరింత క్షీణత కనిపించింది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 95.84 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
తగ్గిన క్రూడ్ రేట్లతో..
క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. వాటిపై భారం భారీగా తగ్గినట్టయింది. ఇదివరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు వాటి రేట్లు తగ్గడం వల్ల చమురు కంపెనీలపై ఆర్థిక భారం తగ్గింది. దీన్ని వాహనదారులకు బదలాయిస్తాయా? లేదా? అనేది వేచి చూడాలి.
మరోసారి వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర
కాగా- ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలో మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన శివసేన-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వాహనదారులకు ఊరట కల్పించింది. ఇంధన అమ్మకాలపై విలువ ఆధారిత పన్నును తగ్గించింది. పెట్రోల్పై లీటర్ ఒక్కింటికి అయిదు రూపాయలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి మూడు రూపాయలను మేర వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
మిగిలిన చోట్ల..
మిగిలిన చోట్ల పాత రేట్లే కొనసాగుతున్నాయి. చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. వ్యాట్ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది
విశాఖపట్నంలో..
కోల్కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.
హైదరాబాద్లో..
అహ్మదాబాద్లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
తగ్గించింది కొన్ని రాష్ట్రాలే..
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను కుదించాయి. ఇప్పుడు తాజాగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మరోసారి వ్యాట్ను కుదించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.