మరింత తగ్గిన క్రూడాయిల్ ధరలు: ఆ కంపెనీలపై తొలగిన పెను భారం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో పతనం కొనసాగుతోంది. మొన్నటి వరకు 105 నుంచి 110 డాలర్ల వరకు వెళ్లిన బ్యారెల్ రేటు.. ఇప్పుడు క్షీణించింది. 95 డాలర్ల కంటే దిగువకు ట్రేడ్ అయింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 94.18 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 88.09 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
ఊపిరి పీల్చుకుంటోన్న ఆయిల్ కంపెనీలు
క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పడుతుండటంతో ఆయిల్ కంపెనీలు కాస్త ఊపిరి పీల్చుకుంటోన్నాయి. క్రూడ్ ధరలు భారీగా పెరగడం.. అదే సమయంలో రూపాయి పతనం కావడం వంటి పరిణామాలతో ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది. క్రూడ్ రేట్లు బ్యారెల్ ఒక్కింటికి దాదాపుగా 10 డాలర్ల మేరకు మిగులు కనిపించడంతో ఊరట కలిగినట్టయింది. ఆ పెనుభారం నుంచి కాస్త ఉపశమనం కలిగింది.
మరో ఆశ..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై రాయితీని కల్పించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. గత సంవత్సరం నవంబర్లో ఒకసారి, ఈ ఏడాదిలో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఇంధన అమ్మకాలపై రాయితీని ప్రకటించిన అనుభవం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నందున.. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని వాహనదారులు ఆశిస్తోన్నారు.
ఇవ్వాళ్టి కొత్త రేట్లివీ..
కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.
విశాఖలో..
కోల్కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్లో..
అహ్మదాబాద్లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
వ్యాట్ తగ్గింపుపై..
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.