LPG Prices Hike: డబుల్ బాదుడు.. భారీగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంపు.. సామాన్యులకు షాక్
LPG Prices Hike: దేశంలోని చమురు కంపెనీలు సామాన్యుల నెత్తిన గ్యాస్ భారాన్ని మరోసారి పెంచాయి. ఫిబ్రవరిలో కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ధరల పెంపును కంపెనీలు ప్రకటించలేదు. అయితే ఇప్పుడు పెంచిన ధరలు చూస్తుంటే కళ్లు తిరిగకమానదు.
సిలిండర్ ధరలు..
మార్చి నెల మెుదటి తారీఖున చమురు కంపెనీలు గృహ వినియోగదారులు వాడే LPG సిలిండర్ పై రూ.50ని పెంచాయి. దీనికి తోడు వ్యాపారులు వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధరలను సైతం కంపెనీలు భారీగానే పెంచాయి. వాణిజ్య సిలిండర్ పై ఒక్కొక్కదానికి రూ.350.50ను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. 2023 ప్రారంభంలో జనవరి నెలలో కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.25 పెంచిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో ధరలు..
తాజా పెంపు తర్వాత.. గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలు దిల్లీలో రూ.1,103, ముంబైలో రూ.1,102.5, కోల్కతాలో రూ.1,129, చెన్నైలో రూ.1,118.5, హైదరాబాద్ లో రూ.1,105కి చేరుకున్నాయి. ఇక వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగిన తర్వాత దిల్లీలో రూ.2,119.5, కోల్కతాలో రూ.2,221.5, ముంబైలో రూ.2,071.5, చెన్నైలో రూ.2,268, హైదరాబాద్ నగరంలో రూ.2,234గా ఉన్నాయి.
జనం గగ్గోలు..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులకు గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం ఉన్న ధరలో దాదాపు సగం ధరకే లభించేంది. ప్రస్తుతం రెండు సిలిండర్ల ధరకు ఒక సిలిండర్ లభించటే స్థాయికి ధరలు పెరగటంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరిగినంత వేగంగా తమ ఆదాయాలు పెరగటం లేదని వారు వాపోతున్నారు. ఆదాయం పెరగకున్నా ఇంటి ఖర్చులు పెరిగిపోవటంతో ఆందోళన చెందుతున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగటమే తప్ప తగ్గిందిలేదంటూ పెదవి విరుస్తున్నారు.
భారంగా మారనున్న తిండి..
ప్రస్తుతం ప్రజలు ధరల భారం కారణంగా బయట హోటళ్లు, రెస్ట్రారెంట్లకు వెళ్లటం దాదాపు మానుకున్నారు. ఇకపై ఇంట్లో కూడా పొయ్యి ముట్టించే పరిస్థితి లేదని సగటు భారతీయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ధరల భారం రానున్న సార్వత్రిక ఎన్నికలను ఎంత మేర ప్రభావితం చేస్తుందనేది వేచి చూడాల్సిన అంశం. దేశంలోని విపక్షాలు మాత్రం ఈ విషయంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఆరోపిస్తున్నాయి.