భారత ఐటీ పితామహుడు, టీసీఎస్ ఫౌండర్ ఎఫ్సీ కోహ్లీ కన్నుమూత
టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) పౌండర్, తొలి చైర్మన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీగా పేరుగాంచిన ఎఫ్సీ కోహ్లీ 96వ ఏట కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఫకీర్ చంద్ కోహ్లీ. టీసీఎస్ ఫౌండర్గా, మొదటి సీఈవోగా పని చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. 100 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి పునాది వేసిన కోహ్లిని సాఫ్ట్వేర్ పరిశ్రమ పితామహుడిగా పిలుస్తారు.
భారత టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన కోహ్లీ మరణంపై కార్పొరేట్ దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి అనేక చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో తరాల దేశీయ ఐటీ నిపుణలు ఆయనకు రుణపడి ఉంటారని కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఛైర్మన్ రామ్కుమార్ రామమూర్తి , మాజీ నాస్కామ్ చైర్మన్ గణేష్ నటరాజన్ అన్నారు.
ఎఫ్సీ కోహ్లీ 1924 మార్చి 19న పెషావర్ బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. లాహోర్లోని పంజాబ్ వర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించారు. 1951లో టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరిన కోహ్లీ.. ఆ తర్వాత 1970లో టాటా ఎలక్ట్రిక్ కంపెనీలకు డైరెక్టర్ అయ్యారు. 1968లో జేఆర్డీ టాటా, కోహ్లీ కలిసి టీసీఎస్ను స్థాపించారు. 1995-96 మధ్య నాస్కాం అధ్యక్షుడిగా పని చేశారు.