భారత్కు మరో అమెరికా కంపెనీ గుడ్బై, ఫోర్డ్ 2 ప్లాంట్లు క్లోజ్
భారత మార్కెట్లో పట్టు కోసం దశాబ్దాల పాటు ప్రయత్నించిన అమెరికా ఆటో దిగ్గజం ఫోర్ట్ వెళ్లిపోతోంది. భారత్లోని రెండు ప్లాంట్లు చెన్నై (తమిళనాడు), సనంద్(గుజరాత్)లలో వాహన తయారీ యూనిట్లలో కార్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా దిగుమతి చేసుకున్న కార్లను మాత్రమే ఇక్కడ విక్రయించనున్నట్లు వెల్లడించింది. 250 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడులతో చెన్నై, సనంద్లో వాహన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. ఈ ప్లాంట్లలో ఎకోస్పోర్ట్, ఫిగో, యాస్పైర్, ఫ్రీస్టైల్, ఎండీవర్ మోడల్స్ను తయారు చేస్తోంది. ఈ ఏడాది చివరి అక్టోబరు-డిసెంబర్లో సనంద్ ప్లాంటులో వాహనాల అసెంబ్లింగ్ను, వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్లో చెన్నై ప్లాంటులో వాహనాలు, ఇంజన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే భారత్ నుండి కంపెనీ పూర్తిగా నిష్క్రమించడం లేదు.
ఉత్పత్తి నిలిపివేత తర్వాత లగ్జరీ కారు మస్టంగ్తో పాటు ఎలక్ట్రిక్ మోడల్స్ను దిగుమతి చేసుకొని విక్రయాలు జరపనుంది. ప్రస్తుత కస్టమర్లకు విడిభాగాలు, సర్వీసింగ్, వారంటీ సేవలను కొనసాగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ అవసరాల కోసం సనంద్ ప్లాంటులో ఇంజిన్ల తయారీని మాత్రం కొనసాగిస్తుంది. ఫోర్డ్ బిజినెస్ పునర్వ్యవస్థీకరణ ప్రభావం 4,000కు పైగా ఉద్యోగులు, 150 ప్రధాన డీలర్లపై ఉండనుంది. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియాలో పదకొండువేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. గత పదేళ్లలో కంపెనీ 200 కోట్ల డాలర్లకు పైగా నష్టాలు నమోదు చేసింది. అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ 2017లో భారత్ నుండి వెళ్లిపోయింది.
వివిధ విదేశీ ఆటో కంపెనీలు భారతీయుడి నాడిని పట్టుకోలేకపోతున్నాయి. అందుకే ఇక్కడ తమ కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నాయి. గత అయిదేళ్ల కాలంలో ఫోర్డ్తో పాటు ఆరు కంపెనీలు మన దేశాన్ని వీడాయి. ఇందులో జనరల్ మోటార్స్, ఫోర్డ్స్, హార్లీడెవిడ్సన్, UM మోటార్ సైకిల్స్ అమెరికావి. ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ భారత్. ఇక్కడ విదేశీ కంపెనీలు నిలదొక్కుకోలేకపోయాయి.
వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే భారతీయులు భిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక్కడ మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. ఆదాయాల్లో తేడా ఉంటుంది. మన దేశంలో గ్రామీణ, పట్టణ అవసరాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. 2018 నాటికి మన దేశంలో ప్రతి వెయ్యి మందిలో 22 మందికి మాత్రమే సొంతకార్లు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ దేశాల్లో అయితే 900కు పైగా ఉంటుంది. విదేశాలకు చెందిన కంపెనీలు నిలదొక్కకోవడం తక్కువే. జపాన్ సుజుకీ, దక్షిణ కొరియాకు చెదిన హ్యుండాయ్ ఇక్కడ మార్కెట్ను నిలబెట్టుకున్నాయి. హ్యుండాయ్ అనుబంధ సంస్థ కియా కూడా మార్కెట్లో దూసుకెళ్తోంది. ఇక సుజుకీ కంపెనీ మారుతీతో కలిపి హిట్ అయింది. భారత్లో నిలదొక్కుకోవాలంటే తక్కువలో మంచి ఉత్పత్తి అనిపించేలా ఉండాలి. భారత్లో వేగవంతమైన మార్కెట్ను అమెరికా కంపెనీలు అందిపుచ్చుకోలేకపోతున్నాయి. సబ్ కాంపాక్ట్ మార్కెట్ ఊపుమిద ఉందని గమనించిన మారుతీ అందుకు అనుగుణంగా మోడల్స్ను తీసుకు వచ్చింది. ముఖ్యంగా అమెరికా కంపెనీలు భారత్ను దృష్టిలో పెట్టుకొని కార్లను తయారు చేయవనే వాదన ఉంది. అందుకే ఈ కంపెనీలు ఇక్కడ నిలదొక్కుకోలేకపోతున్నాయని అంటారు.
ఓ వైపు మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విదేశీ కంపెనీలు, మరోవైపు కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయి. ఫోర్డ్ వ్యాపారం గత పదేళ్లుగా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రెండు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. గత జూన్ నెలలో 2800 కార్లను కూడా విక్రయించలేకపోయింది. దీంతో కంపెనీ ఇక్కడ కార్యకలాపాలను క్లోజ్ చేస్తోంది. ఫోర్డ్ ప్లాంట్స్ క్లోజ్ అయితే వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. అయితే, బిజినెస్ సొల్యూషన్స్ కార్యకలాపాలు మరింత విస్తృపరిచేందుకు సాఫ్టువేర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్స్, ఆర్ అండ్ డీ, ఇంజినీర్స్, ఆర్థిక-అకౌంటింగ్ వృత్తి నిపుణుల నియామకాలు కొనసాగుతాయని తెలిపింది. ఇదిలా ఉండగా, భారత్లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫోర్డ్ దీనికి సంబంధించి ఓ ప్లాంటును వేరే కంపెనీకి అప్పజెప్పనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.