భారత్ కొంపలు ముంచబోతున్న చైనా.. బ్రహ్మపుత్ర నదిపై మెగా జలవిద్యుత్ డ్యామ్..భూకంపంపై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన
దాయాది దేశం చైనా మళ్లీ భారత్ కొంపలు ముంచబోతోంది. ఈ విషయాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద మెగా డ్యామ్ ను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ డ్యామ్ లైవులోకి వస్తే భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో పాటుగా ఇతర ఆసియా దేశాలపై ఈ డ్యామ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
టిబెట్లోని యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై China నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద భారీగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్టు భద్రతపై ఇప్పుడు సరికొత్తగా నీలినీడలు అలుముకున్నాయి. ఈ మెగా డ్యామ్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న భారతదేశం, బంగ్లాదేశ్ దేశాలలో నీటి సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని..అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని మొదటి నుండి అనేక రకాలైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

(Photo Credit: IANS)
అయితే, ఇప్పుడు బీజింగ్ మద్దతుతో చైనా ప్రభుత్వ సంస్థలు చేపట్టిన ఒక భూగర్భ శాస్త్ర అధ్యయనమే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ భద్రతపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో నివేదించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా జియోలాజికల్ సర్వే పర్యవేక్షణలో చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చైనా సివిల్-మిలిటరీ ఇంటిగ్రేషన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
గత నెలలో చైనీస్ భాషా పత్రిక సెడిమెంటరీ జియాలజీ అండ్ టెథియన్ జియాలజీ'లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. ఈ మెగా డ్యామ్ జలాశయ (రిజర్వాయర్) ప్రాంతం గుండా పైజెన్ ఫాల్ట్ (Paizhen Fault) అనే అత్యంత క్రియాశీలక భూకంప రేఖ నేరుగా వెళుతోంది. హిమయుగం (Pleistocene) నుండి చురుగ్గా ఉన్న ఈ Fault లైన్.. సుమారు 9,500 సంవత్సరాల క్రితం (హోలోసీన్ కాలం) వరకు కూడా అనేక రకాలైన కదలికలను నమోదు చేసింది. దీనికి బలమైన సాక్ష్యంగా.. 2017లో టిబెట్లో ఈ ఫాల్ట్ ఉత్తర కొన సమీపంలో 6.9 తీవ్రతతో సంభవించిన మిలిన్ భూకంపం గురించి పరిశోధకులు ప్రస్తావనలోకి తీసుకువచ్చారు.
ఈ క్రియాశీల భూకంప రేఖ కారణంగా డ్యామ్ చుట్టుపక్కల ఉన్న రాళ్లు విచ్ఛిన్నమై.. వాటి యాంత్రిక లక్షణాలు పూర్తిగా మారిపోయాయని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీనివల్ల అక్కడ నిర్మిస్తున్న భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పునాది భరించే సామర్థ్యం (Bearing Capacity), నిర్మాణ స్థిరత్వం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. జలాశయ ప్రాంతంలోని భూభాగం వదులుగా ఉండే నిర్మాణాన్ని, అలాగే బలహీనమైన సమన్వయాన్ని కలిగి ఉండటం వల్ల.. భూకంప పగుళ్లు ఏర్పడినప్పుడు లేదా దీర్ఘకాలం పాటు నీటిలో మునిగి ఉండటం వల్ల జలాశయానికి ఇరువైపులా ఉన్న వాలులలో (Slopes) అస్థిరత సులభంగా ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఏ చిన్న భూకంపం వచ్చినా కూడా భారీగా కొండచరియలు విరిగిపడటానికి, అలాగే కొండలు కూలిపోవడానికి ఇది దారితీస్తుందని.. తద్వారా అక్కడ పనిచేసే సిబ్బందికి, మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తాజా నివేదికలో హెచ్చరించింది.
గత సంవత్సరం చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ యార్లంగ్ త్సాంగ్పో డౌన్స్ట్రీమ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్.. చైనాలోని ప్రపంచ ప్రసిద్ధ 'త్రీ గోర్జెస్ డ్యామ్' సామర్థ్యానికి దాదాపు మూడు రెట్లు పెద్దదిగా ఉంది. ఇది పూర్తయితే ఏటా సుమారు 300 బిలియన్ కిలోవాట్-గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోనే పైజెన్ గ్రామం ఉండటంతో.. అక్కడి భూగర్భ రికార్డులు నిర్మాణ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి ఇవి కీలక ఆధారంగా మారాయి.
ఈ పెను ముప్పులను తగ్గించడానికి.. కొండచరియలు విరిగిపడకుండా వాలులను రసాయనికంగా లేదా సాంకేతికంగా బలోపేతం చేయడం.. ప్రత్యేక నిలుపుదల అవరోధాలను (Retaining Barriers) ఏర్పాటు చేయడం వంటి కఠినమైన రక్షణ చర్యల ద్వారా మాత్రమే నిర్మాణ స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చని తాజా అధ్యయనం చైనా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒకవేళ ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా, ఆ నది దిగువన ప్రవహించే భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్లలో ఊహించని జలప్రళయం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications
