భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ విడదీయలేరు.. ట్రంప్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన రష్యా..
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. అయితే ఈ ఒప్పందంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అమెరికా ప్రకటించిన ఏకఫక్ష ఫ్యాక్ట్ షీల్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.ఇండియాపై సుంకాల కోతలకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో ఉన్న కొన్ని పప్పుధాన్యాలు అనే పదాలను వైట్ హౌస్ తన పాఠ్యం నుంచి తొలగించింది. ఇది మాత్రమే కాకుండా యుఎస్ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసే విషయంలో ఉపయోగించిన భాషను కూడా మార్చింది. తొలుత భారతదేశం కట్టుబడి ఉంది (commits) అని పేర్కొనగా.. తాజా సవరణలో అదే వాక్యం భారతదేశం ఉద్దేశించింది (intends)గా మారింది.
ఇక ఈ పరిస్థితులు ఇలా ఉంటే రష్యా నుంచి భారత్ ఆయిల్ ఇకపై కొనుగోలు చేయదని ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై రష్యా స్పందించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ అంశంపై Trump మీద విరుచుకుపడ్డారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని అనే మాటలను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప మరెవరూ ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. మాస్కోలోని రష్యా పార్లమెంటు దిగువ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుధవారం లావ్రోవ్ ఈ విధంగా స్పందించారు. న్యూఢిల్లీ నుంచి మాస్కోకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ అందలేదని ఆయన స్పష్టం చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ గానీ.. ఇతర భారతీయ నాయకులు గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని లావ్రోవ్ గుర్తు చేశారు. జనవరి 1 నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్.. ఈ ఏడాది చివర్లో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
ఆ సదస్సులో ఇంధన భద్రత కీలక అంశంగా ఉండనుందని ఇప్పటికే సంకేతాలు ఉన్నాయి. భారత్ నిర్వహించబోయే ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత ప్రధాన అంశంగా ఉండనుందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా లావ్రోవ్ తెలిపారు.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలకు మాస్కో అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. అవసరమైతే వాటిని మరింత బలోపేతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఢిల్లీ-మాస్కో మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని.. శక్తి వనరులు, వాణిజ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారం మరింత విస్తరిస్తుందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ వేదికలపై కూడా అమెరికా వ్యవహరిస్తున్న తీరును లావ్రోవ్ తీవ్రంగా విమర్శించారు. రష్యా చమురు, వాయువు వంటి ఇంధన వనరులను భారత్ సహా ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు వాషింగ్టన్ ఆంక్షలు, సుంకాలు, ప్రత్యక్ష నిషేధాలు వంటి బలవంతపు చర్యలను వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు. టీవీ బ్రిక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్, ఇతర బ్రిక్స్ దేశాల వంటి వ్యూహాత్మక భాగస్వాములతో రష్యాకు ఉన్న వాణిజ్య, పెట్టుబడి, సైనిక-సాంకేతిక సంబంధాలను నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. రష్యన్ ఇంధనాన్ని తక్కువ ధరలకు కొనకుండా నిరోధించి, ఖరీదైన అమెరికా LNGని కొనుగోలు చేయాలని ఈ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారని కూడా లావ్రోవ్ విమర్శించారు.
ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఇంధన భద్రతే తమకు అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టంగా చెబుతోంది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్థిరమైన, సరసమైన ఇంధన సరఫరాలను నిర్ధారించేందుకు ముడి చమురు వనరులను వైవిధ్యపరచడం కొనసాగిస్తామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. 1.4 బిలియన్ జనాభా గల దేశానికి ఇంధన అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా పునరుద్ఘాటించారు.
రష్యా-భారత్ సంబంధాలపై మాట్లాడిన లావ్రోవ్.. డిసెంబర్ 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేసిన రాష్ట్ర పర్యటనను గుర్తు చేశారు. ఆ పర్యటన సందర్భంగా రెండు దేశాలు విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా అనేక కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయని తెలిపారు. ఆ పర్యటన రష్యా-భారత్ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications


