Pakistan: ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్ వంటి విషయాల్లో ఎక్కువగా వినిపించే పేరు పాకిస్థాన్. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ దేశానికి కనీసం రుణాలు లభించకపోవడానికి ముఖ్య కారణాల్లో ఇదొకటి. FATF ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా తన తీరు మార్చుకోని మొండి దేశం పాక్. ఇంతటి చరిత్ర ఉన్న ఈ దేశంపై EU తీసుకున్న తాజా చర్యలు విమర్శలకు కారణమవుతున్నాయి.
మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తున్న దేశాల జాబితా నుంచి పాకిస్థాన్ను యూరోపియన్ కమిషన్ తొలగించింది. తద్వారా ఆదేశానికి చెందిన వ్యాపారాలు, వ్యక్తులను.. ఐరోపాకు చెందిన లీగల్, ఆర్థిక సంస్థలు లోతుగా పరిశీలించే అవసరం ఉండదని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

EU కమిషన్ అధిక-ప్రమాదకర దేశాల జాబితాలో.. మనీలాండరింగ్, తీవ్రవాదులకు ఫైనాన్సింగ్ చేస్తూ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కొని తెచ్చుకుంటున్న దేశాలు ఉన్నాయి. అక్టోబరు 2018లో అదనపు నియంత్రణ పరిమితుల కింద పాకిస్థాన్ను ఇందులో చేర్చారు. దాని ప్రకారం, పాకిస్థాన్లోని వ్యక్తులు, సంస్థలతో చట్టపరమైన, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి ఐరోపా దేశాలు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి.
గతేడాది అక్టోబర్లో, గ్లోబల్ మనీలాండరింగ్ వాచ్లిస్ట్ నుంచి పాకిస్థాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తొలగించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశాన్ని డీఫాల్ట్ కాకుండా ఉంచేందుకు ఈ చర్యలు తీసుకుంది. అక్కడి EU ప్రతినిధి బృందం ఈ చర్యను పాకిస్థాన్కు ముఖ్యమైన సానుకూల చర్యగా పేర్కొంది.
FATF నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు EU సైతం పాకిస్థాన్కు కొంత ఉపశమనం ఇచ్చిందని భావిస్తున్నారు. ఈమేరకు EU ప్రతినిధి బృందం ట్విట్టర్లో ప్రకటించింది. గతేడాది నవంబర్లో, యునైటెడ్ కింగ్డమ్ సైతం తన 'హై-రిస్క్ థర్డ్ కంట్రీస్' జాబితా నుంచి ఒక చట్టబద్ధమైన విధానం ద్వారా పాక్ను తొలగించింది. మరో రకంగా చెప్పాలంటే మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను నియంత్రించడానికి దాయాది చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశం గుర్తించిందన్నమాట.


Click it and Unblock the Notifications