భారత్ కొంపలు ముంచబోతున్న సూపర్ ఎల్ నినో.. హెచ్చరిస్తున్న CREA తాజా అధ్యయనం..
భారతదేశంలో వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే సూపర్ ఎల్ నినో ముప్పుపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో తీవ్రరూపం దాల్చితే ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వర్షపాతం తగ్గడం, విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రభావం పడటంతో పాటు, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
కొత్తగా వెలుగులోకి వచ్చిన అధ్యయనం ప్రకారం.. అంతర్జాతీయ వాతావరణాన్ని వేడెక్కించే 'సూపర్ ఎల్ నినో' (Super El Niño) పరిణామం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశ విద్యుత్ గ్రిడ్పైనే అత్యధిక ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉందని తేలింది. లాభాపేక్ష లేని ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) సోమవారం ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. ఈ వాతావరణ మార్పుల వల్ల దేశంలో బొగ్గు వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛమైన ఇంధనం వైపు సాగుతున్న పరివర్తన (Green Energy Transition) ప్రక్రియ గణనీయంగా నెమ్మదించవచ్చని తెలిపింది.

తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ కండిషనింగ్కు (AC) డిమాండ్ విపరీతంగా పెరగడం.. అదే సమయంలో వర్షపాత లోపంతో జలవిద్యుత్ (Hydro), పవన విద్యుత్ (Wind) కేంద్రాల నుండి ఉత్పత్తి తగ్గడం వల్ల జూలై నుండి ప్రారంభమయ్యే 12 నెలల కాలంలో దేశంలో సుమారు 18 టెరావాట్-గంటల (TWh) విద్యుత్ లోటు ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.
ఈ పరిశోధనలో భాగంగా విశ్లేషించిన ప్రపంచంలోని 110 దేశాలలోకెల్లా భారతదేశంలోనే అత్యంత భారీ విద్యుత్ కొరత ఏర్పడనుందని.. ఈ అదనపు డిమాండ్ను తీర్చడానికి దేశం మళ్లీ బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచక తప్పదని CREA స్పష్టం చేసింది.
నిజానికి 2027 నాటికి దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వాటాను 64 శాతానికి.. ఆ తర్వాతి దశాబ్దంలో దాదాపు 50 శాతానికి తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గత ఏడాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. ప్రస్తుత గ్రిడ్ అవసరాలలో బొగ్గు వాటా ఇంకా 70 శాతానికి పైగానే కొనసాగుతోంది. ఇటువంటి విపరీతమైన సూపర్ ఎల్ నినో పరిస్థితులు సంభవించినప్పుడు.. పర్యావరణ అనుకూల ఇంధన లక్ష్యాల సాధన మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.
ఈ సవాళ్లను అధిగమించడానికి దేశంలో సౌర విద్యుత్ (Solar Energy) కేంద్రాల స్థాపన వేగంగా జరుగుతున్నప్పటికీ.. శిలాజ ఇంధనాల (Fossil Fuels) పై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించాలంటే బ్యాటరీ నిల్వ (Battery Storage), గ్రిడ్ మౌలిక సదుపాయాలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని CREA డైరెక్టర్ నందికేష్ శివలింగం ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గు ఆధారిత ప్లాంట్లను గ్రిడ్ స్థిరత్వం కోసం నడుపుతున్నప్పటికీ.. భవిష్యత్తులో రాబోయే కొత్త విద్యుత్ డిమాండ్ను మాత్రం కేవలం స్వచ్ఛమైన, పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారానే తీర్చాలని ఆయన సూచించారు.
ఈ సంవత్సరం దేశంలో నమోదైన విపరీతమైన ఉష్ణోగ్రతలు, రికార్డు స్థాయి వేడిగాలుల (Heatwaves) సమయంలో సౌరశక్తి గ్రిడ్కు ఒక కీలకమైన రక్షణ కవచంగా పనిచేసింది. జనవరి, మే నెలల మధ్య కాలంలో పగటిపూట సంభవించిన గరిష్ట విద్యుత్ వినియోగంలో (Peak Demand) దాదాపు పావు వంతు (25%) అవసరాలను కేవలం సోలార్ ప్లాంట్లే తీర్చడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 2024 స్థాయిల కంటే తక్కువగా ఉంచడం సాధ్యపడింది. అయితే సూర్యాస్తమయం తర్వాత వచ్చే పీక్ డిమాండ్ను తట్టుకోవడానికి, బొగ్గు వినియోగాన్ని మరింత తగ్గించడానికి భారతదేశం అత్యంత వేగంగా బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలను (BESS) గ్రిడ్కు జోడించాల్సిన అవసరం ఉందని CREA తన నివేదికలో స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications
