ముంబై విమానశ్రయం స్కాం, జీవీకే గ్రూప్పై ఈడీ మనీలాండరింగ్ కేసు
ముంబై విమానాశ్రయం స్కాంకు సంబంధించి రూ.705 కోట్ల అవినీతి ఆరోపణలతో జీవీకే గ్రూప్ ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) అధికారులు, మరికొన్ని సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ విమానాశ్రయ స్కాంకు సంబంధించి జీవీకే గ్రూప్ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, ఆయన కొడుకు సంజయ్ రెడ్డిలపై CBI ఇదివరకే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈడీ కేసు ఫైల్ చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3 కింద ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. కేసుతో సంబంధమున్న వ్యక్తులను రానున్న రోజుల్లో ప్రశ్నించనున్నారు. కంపెనీల ఖాతాల పరిశీలన, నిధుల బదలీని ఈడీ ప్రారంభించడంతో పాటు ఆస్తుల్ని అటాచ్ చేయవచ్చు. కాగా, ఈడీ నుండి ఎలాంటి నోటీసు రాలేదని జీవీకే ప్రతినిధులు చెబుతున్నారు.
ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య సంస్ధ MIALతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీకే గ్రూప్లోని ఇతర సంస్ధలకు ఆర్ధిక సాయం చేసే పేరుతో మరో రూ.395 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఈ కేసులో గుర్తించింది.