Economic Survey: రేపు పార్లమెంటుకు ఆర్థిక సర్వే
బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి (శుక్రవారం, 29) ప్రారంభమవుతున్నాయి. భారత ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు పార్లమెంటులో ఎకనమిక్ సర్వేను ప్రవేశపెడతారు. అయితే ఈసారి బడ్జెట్కు ముందు రోజు ఆదివారం వస్తోంది. ఇప్పటికే డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ పరిధిలో ఎకనామిక్ డివిజన్ దీనిని సిద్ధం చేసింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రేపు ప్రసంగించనున్నారు. ఆర్థిక సర్వే అనంతరం 30వ తేదీన అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈసారి ఆర్థిక సర్వేలో దేశం ఎదుర్కోబోయే కీలక సవాళ్లను ప్రస్తావించారు.
ప్రతి సంవత్సరంలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు అందిస్తుంది. ఆర్థిక సర్వే వెల్లడించే భవిష్యత్తు సంకేతాలు, ఇందుకు సంబంధించిన అంశాలు, కారణాలపై ఆర్థిక పరిశీలకులు ఆసక్తిని కలిగి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అంశాలను చూసే దృష్టికోణం ఇందులో బయటపడుతుంది. దేశ ఆర్థిక పరిస్థితులను ఈ సర్వే వివరిస్తుంది.
అయితే ఈ సర్వే సలహాలను కచ్చితంగా పాటించాలనే రూల్స్ లేవు. 2020లో ఈ సర్వే ఫలితం నేపథ్యంలో, ఈసారి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే.