పారదర్శకంగా : సావరీన్ రేటింగ్ మెథడాలజీపై ఎకనమిక్ సర్వే ఆగ్రహం
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదని, ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. సార్వభౌమ రేటింగ్ మెథడాలజీ పట్ల ఎకనమిక్ సర్వే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు BBB- రేటింగ్ సరికాదని పేర్కొంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న (జనవరి 29, శుక్రవారం) ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
ఆర్థిక సర్వేపై పలువురు స్పందించారు. గడ్డుకాలం ముగిసిందని, వృద్ధి పట్టాలెక్కిందని ఆర్థిక సర్వే తెలిపిందని అయితే అందరికీ వ్యాక్సిన్, సేవా రంగం పురోగతితో జీడీపీకి అసలు సిసలు బలమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ అన్నారు. రాబోయే బడ్జెట్ను ఈ సర్వే ప్రతిబింబిస్తోందని, ప్రభుత్వం నుండి అన్ని రంగాలకు మద్దతు కొనసాగాలని, జాతి అవసరాల కోసం కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంపై సర్వే ఆశాభావంతో ఉందని, అందరం కలిస్తే ఇది సాధ్యమని అసోచామ్ ప్రధాన కార్యదర్శి అన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మైనస్ 7.7 శాతంగా ఉండవచ్చునని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 11 శాతానికి పెరగవచ్చునని ఆర్థిక సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగం మాత్రమే ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని సూచించింది. ఈ ఆర్థిక సర్వేను కరోనా వారియర్స్కు అంకితమిచ్చారు.