నిరాశపరిచిన డాక్టర్ రెడ్డీస్ ... క్యూ 3 లో రూ 570 కోట్ల నష్టం!
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. డిసెంబర్ 31 తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తృతీయ త్రైమాషిక (క్యూ 3) ఫలితాలను సోమవారం ప్రకటించింది. అంతా ఆశించినట్లు నికర లాభం పెరగక పోగా ... రూ 570 కోట్ల (రూ 569.70) నష్టాన్ని చవిచూసింది. ఈ త్రైమాషికంలో జనరిక్ ఔషధం నువారింగ్ సహా కొన్నినాన్ - కరెంటు అసెట్స్ ఇంపైర్మెంట్ కేటాయింపుల వల్ల ఈ మేరకు నష్టం సంభవించినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఈ మేరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీ ఎస్ ఈ )కి సమాచారం ఇచ్చింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాషికంలో డాక్టర్ రెడ్డీస్ రూ 485.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించటం విశేషం. అయితే, క్యూ 3 లో కంపెనీ ఆదాయం మాత్రం 13.86% పెరిగి రూ 4,348.8 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాలపై స్పందించిన డాక్టర్ రెడ్డీస్ కో- చైర్మన్ & ఎండీ జి వి ప్రసాద్... మూడో త్రైమాషికంలో అన్ని విభాగాల్లోనూ కంపెనీ మెరుగైన పనితీరు కనబరించిందని చెప్పారు. తప్పనిసరి ఇంపైర్మెంట్ వల్ల నికర లాభం ప్రభావితం అయిందని వివరించారు. అయితే, ఎగ్జిక్యూషన్ పై అధిక ద్రుష్టి కేటాయిస్తున్నామని, నాణ్యత, కార్యనిర్వాహక సమర్థత అంశాల్లో గొప్ప పురోగతి సాధించామని ఆయన పేేర్కొన్నారు.
ఈపీఎఫ్ తగ్గించనున్న ప్రభుత్వం... దీంతో మీ శాలరీ ఎంత పెరుగుతుందో తెలుసా?
జనరిక్స్ హవా...
జనరిక్ ఔషధాల తయారీ, ఎగుమతుల్లో డాక్టర్ రెడ్డీస్ కు తిరుగులేదు. ముఖ్యంగా అమెరికా మార్కెట్ కు ఈ కంపెనీ పెద్ద మొత్తంలో ఔషధాలను ఎగుమతి చేస్తుంది. దాదాపు మూడింట ఒక వంతు ఆదాయం అమెరికా నుంచే సమకూరుతుంది. ఈ విభాగంలో కంపెనీ 15% వృద్ధిని నమోదు చేసింది. క్యూ 3 లో రూ 3,592.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అమెరికా లో 8% వృద్ధి, ఇండియాలో 13%, యూరోప్ లో 52% వర్ధమాన మార్కెట్లలో 19% వృద్ధి నమోదు కావటంతో ఇది సాధ్యపడింది. ఫార్మాస్యూటికల్ సర్వీసులు, ఏపీఐ వ్యాపారంలో కూడా 16% వృద్ధి కనిపించింది. అయితే, ప్రొప్రయిటరీ విభాగంలో మాత్రం రాబడులు 18% తగ్గిపోయాయి.
పెరిగిన మార్జిన్లు...
ఇదిలా ఉండగా కంపెనీ మార్జిన్లు మాత్రం మూడో త్రైమాషికంలో మెరుగ్గా నమోదయ్యాయి. ఈ విషయంలో మార్కెట్ అనలిస్టుల అంచనాల కంటే కూడా బెటర్ గా కంపెనీ పనితీరు కనిపించింది. క్యూ 3 లో డాక్టర్ రెడ్డీస్ ఎబిటా మార్జిన్ 24.1% పెరిగి రూ 1,073.7 కోట్లకు చేరింది. అనలిస్టులు మాత్రం 20-21% ఎబిటా మార్జిన్ల ను అంచనా వేశారు. కాగా, ప్రస్తుత సమీక్ష త్రైమాషికంలో కంపెనీ జనరిక్ నువారింగ్ ఔషధం విలువ భారీగా పతనం కావటంతో రూ 1,113.7 కోట్లు ఇంపయిర్మెంట్ చార్జీల కింద, ఇతర ప్రొడక్టుల కొరకు మరో రూ. 206.3 కోట్ల ఇంపయిర్మెంట్ చార్జీలను కేటాయించింది. ఇందుకోసం మొత్తం రూ 1,320 కోట్లను కేటాయించింది. లేదంటే, డాక్టర్ రెడ్డీస్ నికర లాభం మెరుగ్గా ఉండేది.
షేర్ల హుషారు..
డాక్టర్ రెడ్డీస్ క్యూ 3 లో నష్టాలు ప్రకటించినప్పటికీ... కంపెనీ పనితీరు మెరుగవ్వటంతో షేర్లు పరుగులు పెడుతున్నాయి. గత ప్రారంభం నుంచి మధ్యాన్నం 1.30 సమయానికి 4.86% పెరిగి రూ. 3,175.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి ఐన రూ 3,187ను కూడా తాకటం విశేషం. కంపెనీ నష్టాలు కేవలం ఒక ఉత్పత్తికి సంబంధించి చేసిన కేటాయింపుల వల్ల జరిగిందే కానీ దాని పనితీరు వల్ల కాదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే త్రైమాషికంలో డాక్టర్ రెడ్డీస్ పనితీరు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.