డీమార్ట్ దమానీ..రికార్డ్ బ్రేక్: రూ.వెయ్యిన్నొక్క కోట్లు: రెండంతస్తుల భవనానికే:
ముంబై: ప్రముఖ రిటైల్ చెయిన్ సూపర్ మార్కెట్ డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ.. మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ సారి అల్లాటప్పాగా రాలేదాయన. ఓ భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. దాని విలువ 1,001 కోట్ల రూపాయలు. తన సోదరుడు గోపీ కిషన్ దమానీతో కలిసి దాన్ని కొనుగోలు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై దక్షిణ ప్రాంతంలోని మలబార్ హిల్లో ఈ ప్రాపర్టీని ఆయన పర్ఛేజ్ చేశారు. అదొక రెసిడెన్షియల్ ప్రాపర్టీ. వెయ్యిన్నొక్క కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టడానికి అందులో ఏముందని అనుకుంటున్నారా?..
ఎక్స్ట్రార్డినరీ ప్రాపర్టీ అది. మలబార్ హిల్లో 5,752.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక్కో చదరపు అడుగు కోసం దమానీ ఖర్చు పెట్టింది.. అక్షరాలా 1,61,670 రూపాయలు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరగలేదని ముంబై వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కడే గానీ ఇంత భారీ మొత్తంలో ప్రాపర్టీ క్రయ, విక్రయాలు నమోదు కాలేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండంతస్తుల భవనాన్ని దమానీ కిందటి నెల 31వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పోర్టల్ పేర్కొంది.
ఈ భవనం రిజిస్ట్రేషన్ సమయంలో దమానీ సోదరులు చెల్లించిన స్టాంప్ డ్యూటీ 30 కోట్ల రూపాయలు. ఈ ప్రాపర్టీ కొనుగోలుపై వ్యాఖ్యానించడానికి దమానీ కుటుంబ సభ్యులెవరూ ఇప్పటికిప్పుడు ఆసక్తి చూపలేదని ఆ న్యూస్ పోర్టల్ వివరించింది. రాధాకిషన్ దమానీ.. ఇదివరకే ముంబైలో ఓ ప్రాపర్టీని కొన్నారు. ముంబై అల్టామౌంట్ రోడ్లో ఓ అత్యాధునిక వసతులతో కూడిన భవనాన్ని ఆయన సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేష్ షా నుంచి కొనుగోలు చేశారు.
ఈ మధ్యే ఆయన థానేలో మాండలేజ్ ఇండియాకు చెందిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నారు. దీనికోసం 250 ఎకరాలను ఖర్చు చేశారు. డీమార్ట్కే చెందిన అవెన్యూ సూపర్ మార్కెట్స్ కోసం 39 వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియా గల రెండంతస్తుల భవనాన్ని 113 కోట్ల రూపాయలతో కొన్నారు. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. తన వ్యాపార కార్యకలాపాలతో పాటు నివాసాన్ని కూడా ముంబైకే మార్చుకోవాలని దమానీ భావిస్తున్నారంటూ వస్తోన్న వార్తలకు ఇది మరింత బలాన్నిచ్చినట్టయింది.