భారత్తో పన్ను వివాదం, రూ.12,000 కోట్ల వసూలుకు కెయిర్న్ యత్నం
బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ భారత్ నుండి 120 కోట్ల డాలర్ల పరిహారం వసూలుకు ఎయిరిండియా కంపెనీ ఆస్తుల జఫ్తుకు కోర్టును ఆశ్రయించింది. మన కరెన్సీలో రూ.12వేల కోట్లకు పైగా. ఎయిరిండియా చట్టపరంగా భారత ప్రభుత్వానికి చెందిన ఆస్తి అని పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ సౌత్ డిస్ట్రిక్ట్ కోర్టులో గత శుక్రవారం దావా వేసింది. చమురు అన్వేషణ రంగంలోని కెయిర్న్ కంపెనీ భారత ప్రభుత్వంతో తలెత్తిన వివాదంలో ఎయిరిండియా ఆస్తిని జప్తు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ఎయిరిండియా స్పందించాల్సి ఉంది.
నోటీసులు అందాక..
తమకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు అందుకున్న తర్వాత ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యల నుండి రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కెయిర్న్ దావా నేపథ్యంలో ఎయిరిండియా ప్రయివేటీకరణకు భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. 2006లో కెయిర్న్ నుండి వసూలు చేసిన క్యాపిటల్ గెయిన్స్కు సంబంధించినది ఈ కేసు.
ఇదీ కేసు
1994లో భారత్లో చమురు, గ్యాస్ రంగంలో కెయిర్న్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టింది. దశాబ్దకాలం తర్వాత రాజస్థాన్లో భారీ చమురు క్షేత్రాన్ని గుర్తించింది. 2006లో బీఎస్ఈలో తమ భారతీయ ఆస్తులను కెయిర్న్ లిస్టింగ్ చేసింది. అయిదేళ్ల తర్వాత కెయిర్న్ పైన భారత్ రెట్రోయాక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని అమలు చేసింది.
రీఆర్గనైజేషన్కు సంబంధించి రూ.10,247 కోట్లు, దానిపై వడ్డీ, జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా కెయిర్న్ ఇండియా డివిడెండ్స్ను, పన్ను రిఫండ్స్ను జఫ్తు చేసింది. దీనిపై హేగ్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్లో కెయిర్న్ ఫిర్యాదు చేసింది. ఇక్కడ కెయిర్న్కు అనుకూంగా తీర్పు వచ్చింది. దీనిపై భారత్ న్యాయపోరాటం చేసింది.
కెయిర్న్ ఆరోపణ.. పరిహారం వసూలు యత్నం
భారత్ పాత తేదీ నుండి పన్ను వసూలు చేసినట్టు కెయిర్న్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో 120 కోట్ల డాలర్ల పరిహారం రాబట్టుకునేందుకు కేసు వేసి విజయం సాధించింది. ఇప్పుడు ఆ పరిహారం రాబట్టుకునేందుకు ఎయిరిండియా ఆస్తులను జఫ్తు చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరింది. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా కోర్టుల్లోను పరిహారం కోసం దావాలు వేసేందుకు కెయిర్న్ ప్రయత్నిస్తోంది.