ఆర్థిక సేవలకు క్రిప్టో కరెన్సీ, నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు
ఆర్థిక సేవలకు క్రిప్టో కరెన్సీని వినియోగించవచ్చునని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. అయితే నగదు బదలీకి ఇది అక్రమ మార్గంగా మారకూడదని చెప్పారు. వీటికి ఆర్థిక వ్యవస్థలోకి యువతను ఆహ్వానించే ప్రవేశ మార్గాలుగా ఉపయోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకు వస్తున్న నేపథ్యంలో నందన్ నీలేకని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
క్రిప్టో కరెన్సీని ధనంగా కాకుండా ఆస్తులుగా పరిగణించి, చట్టబద్ధమైన క్రిప్టో మార్కెట్ను తీసుకురావాలని, అలా చేస్తే యువత క్రిప్టోకు సంబంధించి వినూత్న ఆవిష్కరణలు చేయగలదని, తద్వారా అంతర్జాతీయస్థాయి కంపెనీలను సృష్టించగలదని నందన్ నీలేకని అన్నారు. మరో విషయం ఏమంటే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్కు తగినది కాదని, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ అస్థిరంగా ఉంటుందని, అలాగే, వీటి ట్రాన్సాక్షన్కు అయ్యే ఖర్చు కూడా ఎక్కువేనని నందన్ నీలేకని అన్నారు.
ప్రస్తుతం భారత దేశంలో 2 కోట్లమంది వరకు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నారని, వాటి వ్యాల్యూ రూ.40 వేల కోట్లు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తోన్న విషయం తెలిసిందే.