ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా మొర ఆలకించండి: సీతారామన్కు మాల్యా, లాక్డౌన్పై ఏమన్నాడంటే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఓ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్కు చెందిన 100 శాతం రుణాలను తాను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా భారీగానే ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో మాల్యా ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలోనైనా తన విజ్ఞప్తిని ఆలకించాలని కోరారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పులు వంద శాతం తిరిగి చెల్లిస్తానని, తన కోరిక మన్నించాలన్నారు.
కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపు
ఇప్పుడైనా తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్మల సీతారామన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తాను తీసుకున్న రుణాల్ని మొత్తం తిరిగి చెల్లిస్తానని పలుమార్లు చెబుతున్నప్పటికీ బ్యాంకులు సిద్ధంగా లేవన్నారు. బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్మెంట్లను విడుదల చేసేందుకు ఈడీ కూడా సిద్ధంగా లేదన్నాడు.
కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో తాను చెల్లిస్తానన్న రుణాల విషయంలో ఆర్థికమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్త లాక్డౌన్ను గౌరవిస్తున్నామన్నాడు. కింగ్ ఫిషర్లో అన్ని కార్యకలాపాల్ని, తయారీని నిలిపివేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇంటివద్దే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా సూచించారు. తాను కూడా అదే పాటిస్తున్నానని తెలిపారు.