అనిల్ అంబానీ 3 చైనా బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. 716 మిలియన్ డాలర్ల (రూ.5,276) రుణాల కేసులో డ్రాగన్ దేశానికి చెందిన బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల వివరాలను అంచనా వేసేందుకు సిద్ధం అయ్యాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి.
తమకు రావాల్సిన రుణ బకాయిల కోసం అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకుంటామని చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

చైనా బ్యాంకుల ప్రకటన
తాజాగా, శుక్రవారం తాను సాధారణ జీవనం సాగిస్తున్నట్లు యూకే కోర్టుకు అనిల్ అంబానీ స్పష్టం చేశారు. అనంతరం చైనా బ్యాంకులు ప్రకటన విడుదల చేశాయి. తమ హక్కులను పరిరక్షించుకోవడానికి, రుణాలను రాబట్టుకోవడానికి క్రాస్ ఎగ్జామినేషన్ నుండి పొందిన సమాచారాన్ని ఉపయోగిస్తామని తెలిపాయి. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాల్ని ఉపయోగించుకుంటామని తెలిపాయి. బ్యాంకులు భారతదేశం వెలుపల.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై చర్యలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

కోర్టుకు అంబానీ వెల్లడి..
తాను సాధారణ జీవితం గడుపుతున్నానని, కేవలం ఒక్క కారును మాత్రమే ఉపయోగిస్తున్నానని, చట్టపరమైన ఛార్జీలు చెల్లించేందుకు బంగారాన్ని కూడా విక్రయించానని అనిల్ అంబానీ ఇటీవల యూకే కోర్టుకు వెల్లడించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనంతరం ఆయన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. అంబానీ సంస్థ ఆర్.కామ్.కు ఇచ్చిన 925 మిలియన్ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా.. ఆయనను బ్రిటన్ కోర్టుకు లాగాయి.
మే 22న 21 రోజుల్లోగా ఈ మూడు బ్యాంకులకు 716 మిలియన్ డాలర్లకు పైగా మొత్తంతో పాటు ఇతర ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. జూన్ 12వ తేదీతో గడువు ముగిసినప్పటికీ ఆయన చెల్లింపులు చేయలేదు. దీంతో బ్యాంకులు ఆయన ఆస్తులను బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాయి. దీనికి అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో లాయర్ అడిగిన ప్రశ్నకు అనిల్ అంబానీ సమాధానం ఇచ్చారు. తన తల్లికి రూ.500 కోట్లు, కుమారుడు అన్మోల్కు రూ.310 కోట్లు రుణపడి ఉన్నట్లు తెలిపారు. తాను రిలయన్స్ ఇన్నోవెంచర్స్ కోసం రూ.5 బిలియన్ల రుణం తీసుకున్నానని, ఆ కంపెనీలో ఉన్న 12 మిలియన్ల షేర్లు ఇప్పుడు దేనికీ ఉపయోగపడవన్నారు. కుటుంబ ట్రస్ట్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఏ ట్రసట్్ వల్ల తాను ప్రయోజనం పొందలేదన్నారు.దీనికి బ్యాంకుల తరఫు లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ.. మీరు వాస్తవాలు చెప్పడం లేదన్నారు.

ఒక కారు మాత్రమే ఉంది..
దీనికి అనిల్ అంబానీ స్పందిస్తూ తన వద్ద 1,11,000 డాలర్ల విలువైన కళాకృతి మాత్రమే ఉందని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తాను ఎలాంటి ప్రొఫెషన్ ఫీజు పొందలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ ఏడాది ఆశించడం లేదన్నారు. తనకు ఖర్చులు చాలా తక్కువ అని, ఇతర ఆదాయం లేదని, ఒక కారు మాత్రమే ఉందని, తన వద్ద ఎప్పుడూ రోల్స్ రాయల్ కారు లేదన్నారు. అవి మీడియా ఊహాజనితాలే అన్నారు. ఆభరణాలు అమ్మి చట్టబద్దమైన ఖర్చులకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు మరిన్ని ఖర్చులు అయితే ఇతర ఆస్తులకు సంబంధించి కోర్టు ఆమోదానికి లోబడి ఉంటానని, హెలికాప్టర్ను ఉపయోగించడం లేదన్నారు.
లండన్, కాలిఫోర్నియా, బీజింగ్లలో షాపింగ్ గురించి ప్రస్తావించగా, తన తల్లి కోసం చేసినట్లు చెప్పారు. 8 నెలల కాలంలో వచ్చిన రూ.60.6 లక్షల కరెంట్ బిల్లుకు అధిక టారిఫ్ కారణమన్నారు. అనిల్ అంబాని ఒకప్పుడు ప్రపంచ ఆరో కుబేరుడు కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications