Crypto crash: క్రిప్టోపై కేంద్రం కీలక నిర్ణయం! బిట్ కాయిన్ సహా కరెన్సీలు పతనం
క్రిప్టో కరెన్సీ పైన భారత ప్రభుత్వం తాజా నిర్ణయం నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో నియంత్రణ బిల్లును వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం అన్ని ప్రయివేటు క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేస్తుందని లేదా నియంత్రిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు నేడు పతనమయ్యాయి. నిన్న రాత్రి సమయానికి దాదాపు అన్ని క్రిప్టోలు కనీసం పదిశాతం నుండి అంతకుమించి నష్టాన్ని నమోదు చేశాయి.
బిట్ కాయిన్, ఎథేరియం పదిహేను శాతం కంటే ఎక్కువగా నష్టపోయాయి. కేంద్రం ప్రకటనతో సందిగ్ధం, ఆందోళనలో పడిన క్రిప్టో ట్రేడర్లు ముందుజాగ్రత్తగా కాయిన్స్ పైన తమ పెట్టుబడులను ఉఫసంహరించుకుంటున్నారు. దీంతో క్రిప్టో నేలచూపులు చూస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రవేశ పెట్టనున్నారు. దేశంలోని అన్ని ప్రయివేటు లేదా పర్సనల్ క్రిప్టో కరెన్సీలపై నియంత్రణకు ఈ బిల్లు వీలు కల్పించనుంది. అంతేకాకుండా ఆర్బీఐ పరిధిలో కొత్త డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ఆర్బీఐ జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి ఒక సులభతరమైన ప్రేమ్ వర్క్ను రూపొందిస్తారు.
కేంద్రం ప్రకటన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ భారీగా నష్టపోయింది. నేడు దాదాపు రెండు శాతం క్షీణించి 56,500 డాలర్ల దిగువకు పడిపోయింది. ఎథేరియం, సోలానా కూడా క్షీణించాయి. ఓ సమయంలో బిట్ కాయిన్ 15 శాతం, ఎథేరియం 7 శాతం, కార్డానో 13 శాతం, టెథేర్ 12 శాతం, సోలానా 10 శాతం క్షీణించాయి.