GST: జీఎస్టీ పరిధిలోకి కిరాణా వ్యాపారులు.. ఆదాయం పెంపుకు కేంద్రం సన్నాహాలు..!
GST: ఇప్పటికే కరోనా వల్ల వ్యాపార నష్టం, పెద్ద కిరాణా వ్యాపారుల నుంచి పోటీ, పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల తగ్గిన వ్యాపారంతో దేశంలోని కిరాణా దుకాణదారులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వారిపై జీఎస్టీ పిడుగు వేయాలని చూస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదాయం కోసం..
కేంద్ర ప్రభుత్వం దేశంలో పన్ను పరిధిని విస్తృతం చేసిన ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చిల్లర వ్యాపారులను టాక్స్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మార్కెట్ పరిధితో పోల్చితే పన్ను చెల్లింపుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని భావిస్తున్నామని.. అందుకే కొన్ని రంగాల్లో సెక్టోరల్ విధానాన్ని అనుసరించాలని చూస్తున్నట్లు CBIC చైర్మన్ వివేక్ జోహ్రి వెల్లడించారు.
జీఎస్టీ విస్తరణ..
ఆర్థిక వ్యవస్థలోని మరిన్ని అంశాలను పన్నులోకి తీసుకురావాలని దిల్లీ స్థాయి నేతలు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్ పెద్ద అనధికారిక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని భావిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ వాటిని పన్ను విధానం కిందకు తీసుకురావాలని తద్వారా ఆదాయాన్ని పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
2017లో జీఎస్టీ..
దేశంలో VAT విధానానికి బదులుగా జీఎస్టీని 2017లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో జీఎస్టీ కింద దాదాపు 60 లక్షల వ్యాపారాలు వచ్చాయి. అయితే జనవరి 2023 నాటికి జీఎస్టీ పరిధిలోకి వచ్చిన వ్యాపారుల సంఖ్య పెరిగి 1.4 కోట్లకు చేరుకుంది. అయితే మరింత మందిని ఈ పరిధిలోకి తీసుకురావాలని ప్రస్తుతం కేంద్ర పెద్దలు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు.
సమాచార సేకరణ..
సరైన టాక్స్ చెల్లింపుదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ డేటాబేస్లు, వివిధ ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న డేటాను సేకరిస్తున్నట్లు CBIC చైర్మన్ వివేక్ జోహ్రి చెప్పారు. ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆస్తిపన్ను, వాణిజ్య డైరెక్టరీలు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల డేటాను కూడా ఇందుకోసం వాడుకోనున్నట్లు జోహ్రీ స్పష్టం చేశారు. ఇది నిజంగా మూలిగే నక్కపై తాటికాయ పడటం లాంటిదేనని చాలా మంది దుకాణదారులు అభిప్రాయపడుతున్నారు.