Mumbai airport scam: జీవీకే గ్రూప్పై ఈడీ మనీలాండరింగ్ కేసు
జీవీకే గ్రూప్ చైర్మన్, ఆయన కొడుకుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి జీవీకే చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, తనయుడు సంజయ్ రెడ్డిలపై కేసు నమోదయింది. తాజాగా మంగళవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.705 కోట్ల అవినీతి ఆరోపణలతో జీవీకే గ్రూప్, ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) అధికారులు, మరికొన్ని సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిందని తెలుస్తోంది.
ట్రంప్ దెబ్బ, ఇండియన్ ఐటీ కంపెనీలకు రూ.1,200 కోట్ల భారం
మనీ లాండరింగ్ చట్టం
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA-ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) సెక్షన్ 3 కింద ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను రానున్న రోజుల్లో ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో కంపెనీల ఖాతాల పరిశీలన, నిధుల బదలీని ఈడీ ప్రారంభిస్తుందని తెలుస్తోంది. దర్యాఫ్తులో భాగంగా ఆస్తుల్ని అటాచ్ చేయవచ్చు. అయితే ఈడీ నుండి తమకు ఎలాంటి నోటీసు రాలేదని జీవీకే ప్రతినిధులు చెబుతున్నారు.
గతవారం సీబీఐ సోదాలు
జూన్ 27వ తేదీన కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్డి సహా 13 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. పలు కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. దీని ఆధారంగా ఈడీ తాజాగా మనీ లాండంరింగ్ కేసు నమోదు చేసింది. గత వారం ముంబై, హైదరాబాద్లలోని జీవీకే కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ సోదాలు కూడా చేసింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నించడం, నిధుల బదలీ అంశాలపై విచారణ జరపనుంది. అవసరమైతే విచారణ సమయంలో ఆస్తులను జఫ్తు చేస్తుంది.
దర్యాఫ్తుకు సహకరిస్తామంటూ..
సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసి ఆశ్చర్యపోయామని MIAL అధికార ప్రతినిధి గత వారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ ఏజెన్సీలకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. MIAL బాధ్యతాయుతమైన, పారదర్శకత కలిగిన కార్పోరేట్ సంస్థ అని, నిజానిజాలు తెలుసుకోవడానికి దర్యాఫ్తు ఏజెన్సీలతో కలిసి పని చేస్తోందని తెలిపారు.
ఏం జరిగింది
ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య సంస్ధ MIALతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీకే గ్రూప్లోని ఇతర సంస్ధలకు ఆర్ధిక సాయం చేసే పేరుతో మరో రూ.395 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఈ కేసులో గుర్తించింది. ప్రస్తుతం జీవీకే కృష్ణారెడ్డి గ్రూప్ ఛైర్మన్గా, తనయుడు సంజయ్ రెడ్డి జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ ఎండీగా ఉన్నారు. వీరిద్దరు ప్రమోటర్లుగా ఉన్న గ్రూప్లోని ఇతర కంపెనీల కోసమే ఈ మొత్తాన్ని దారి మళ్లించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ఇందులో మరో 9 సంస్ధలతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని పలువురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సీబీఐ నిర్ధారించింది. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ది కాంట్రాక్ట్ దక్కించుకున్న జీవీకే గ్రూప్కు చెందిన ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్కు అందులో 38.07 శాతం వాటా ఉంది. ఎయిర్ పోర్ట్ ఆథారిటీకి 26 శాతం వాటా ఉంది. 2012 నుంచి ఎయిర్ పోర్టు అభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.395 కోట్ల రిజర్వు ఫండ్స్ను తన గ్రూప్ కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ తమ ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. తద్వారా బోగస్ కాంట్రాక్టుల ద్వారా కూడబెట్టిన రూ.310 కోట్లు, రూ.395 కోట్ల దారి మళ్లింపు మొత్తం కలిపి రూ.705 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదు చేసింది.