IT news: కర్ణాటకలో ఇప్పటికే ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ వెలువడింది, వచ్చే నెలలో పోలింగ్ కు ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నాయి. ఈ సమయంలో IT విభాగానికి చెందిన CBDT చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని అధికారపార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
కర్ణాటకలోని కొన్ని సహకార బ్యాంకులపై ఆదాయపు పన్ను శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల దాడులు నిర్వహించింది. ఇందులో వెయ్యి కోట్ల విలువైన బోగస్ ఖర్చులను గుర్తించినట్లు ప్రకటించింది. మొత్తం 16 బ్రాంచ్ లలో ఈ సోదాలు జరిగాయి. ఖాతాదారుల పన్ను ఎగవేతకు సాయం చేస్తున్నట్లు అనుమానం రావడంతో ఈ సెర్చ్ ఆపరేషన్ జరిపినట్లు అధికారులు చెప్పారు. పలు వ్యాపార సంస్థల నిధులను దారి మళ్లించడానికి ప్రయత్నించినట్లు గుర్తించామన్నారు.

మార్చి 31 నుంచి ప్రారంభించిన ఈ సోదాల్లో 3.3 కోట్లకు పైగా నగదు, 2 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు CBDT ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు జారీ చేసిన బేరర్ చెక్కుల విషయంలో.. ఈ సహకార బ్యాంకులు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించింది. కల్పిత, ఉనికిలో లేని సంస్థలను అడ్డుపెట్టుకుని చేసిన మోసాలకు సాక్ష్యాలు లభించాయని దాడుల్లో పాల్గొన్న సిబ్బంది పేర్కొన్నారు. KYC నిబంధనలను సైతం అనుసరించలేదని ఆరోపించారు.
కొందరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సహకార సంఘాలను ఓ పావుగా వినియోగించుకున్నారని IT విభాగం పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని పలు నిబంధనలను అతిక్రమించారని వెల్లడించింది. ఈ విధంగా వ్యాపార సంస్థలు చేసిన బోగస్ ఖర్చు సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చు అని అధికారులు తెలిపారు. ఇష్టం వచ్చినట్లు నగదు డిపాజిట్లను వినియోగించి FDRలను తెరిచారని చెప్పారు. 15 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు రుణాలు ఇచ్చామన్నారు.


Click it and Unblock the Notifications