తప్పు తమ వైపే: ట్యాక్స్ పేయర్లకు రూ.67,401 కోట్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గుడ్న్యూస్ ఇచ్చింది. 23.99 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ కలిగించే ప్రకటనను వెలువడించింది. ట్యాక్స్ పేయర్లకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించినట్లు ఆదాయపు పన్నుల శాఖ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ట్వీట్ చేసింది.
Cryptocurrency: బిట్ కాయిన్, ఎథేరియం ప్రైస్ ట్యాగ్..అనూహ్యం
23.99 లక్షల మందికి..
సీబీడీటీ చేసిన ఈ ప్రకటన వల్ల 23.99 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి అంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేసిన పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయని వారిపై ఈ రకంగా పెనాల్టీ విధించింది.
67 వేల కోట్లు..
ఆలస్యపు రుసుము, అదనపు వడ్డీ, ఇతర పెనాల్టీల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని మళ్లీ ట్యాక్స్పేయర్లకు చెల్లించినట్లు తెలిపింది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో చోటు చేసుకున్న సాంకేతిక లోపం, తప్పిదాలే దీనికి కారణమని ఆ తరువాత గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. సాంకేతిక లోపం వల్ల ఈ పరిణామం తలెత్తిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల జాప్యం లేదని గుర్తించింది. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్ల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో భాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది.
కార్పొరేట్ ట్యాక్స్ వాటా అధికం..
అదనపు వడ్డీ, ఆలస్య రుసుముల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు ఈ అయిదు నెలల కాలంలోనే రాబట్టిన మొత్తం విలువ 67,401 కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేట్ ట్యాక్సుల వాటా అధికం. కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో 51,029 కోట్ల రూపాయల మొత్తాన్ని అధిక వడ్డీ, ఆలస్య రుసుముగా వసూలు చేసింది. 1,37,327 కార్పొరేట్ కేసులు ఉన్నాయి. మిగిలిన 16,373 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇండివిడ్యువల్స్ నుంచి వసూలు చేసింది. ఇలాంటి 22,61,918 మంది ఉన్నారు. మొత్తం 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసింది.
|
గడువు కూడా పొడిగింపు..
అలాగే- పన్ను చెల్లింపుదారులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడానికి లేటెస్ట్ వెర్షన్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. పొరపాటు తమవైపే ఉండటం వల్ల ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును కూడా పొడిగింది. ఇక ట్యాక్స్ పేయర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా తమ ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి వెసలుబాటును కల్పించింది. ఇదివరకు ఈ గడువు జూలై 31వ తేదీ వరకే ఉండేది.