ట్యాక్స్ పేయర్ల కోసం కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: కొంతకాలంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఆదయాపు పన్నులకు సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడంలో అనేక ఇక్కట్లను చవి చూశారు. తమ ప్రమేయం లేకుండానే, తమ తప్పేమీ లేకుండానే వేల కోట్ల రూపాయల మేర అదనపు జరిమానాలను భరించారు.. ఆలస్యపు రుసుములను చెల్లించారు. ఇలాంటి ఇక్కట్లను ఎదుర్కొన్న వారిలో దేశవ్యాప్తంగా 22.75 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు.
లోపం ఎక్కడ ఉందో కాస్త ఆలస్యంగానైనా తెలుసుకోగలిగింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-ఫైలింగ్ పోర్టల్లోనే అసలు సమస్య ఉందని నిర్ధారించింది. దీనితో- ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన ఆలస్యపు రుసుము, అదనపు జరిమానాలను వెనక్కి ఇచ్చేసింది. ఇలా వెనక్కి తిరిగి చెల్లించిన మొత్తం 49 వేల కోట్ల రూపాయలకు పైమాటే.
కాగా- ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి అత్యంత సులభ పద్ధతి ఇ-ఫైలింగ్ పోర్టల్ ఒక్కటే కావడం వల్ల లక్షలాది మంది దీని మీదే ఆధారపడ్డారు. ఈ పోర్టల్ను డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. ఆ కంపెనీ మళ్లీ.. అందులోని లోపాలను సరి చేసింది. దీనితో నాలుగు రోజుల వ్యవధిలోనేే నాలుగు లక్షలకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. ఇంకా లక్షలాదిగా ఐటీ రిటర్నులు దాఖలు కావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
ఈ పోర్టల్లో సాంకేతిక లోపాలను తొలగించిన తరువాత పెద్ద ఎత్తున తాకిడి నెలకొంది. దీనితో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును పొడిగించే అవకాశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలిస్తోన్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటిదాకా ఎనిమిది మిలియన్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువుతో పోల్చుకుంటే.. ఇప్పుడు తాజాగా దాఖలైనవి కేవలం 14 శాతమే. ఇంకా లక్షల సంఖ్యలో అందాల్సి ఉన్నందున గడువు పొడించే అవకాశాలు లేకపోలేదు.