ఐటీ రిటర్న్స్ ఊరట, మార్చి 15 వరకు... మరోసారి గడువు పొడిగింపు
ఆడిట్ అవసరమయ్యే కంపెనీలు, వ్యాపార సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పొడిగించింది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి మార్చి 15వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఐటీ చట్టం 1961లోని నిబంధన ప్రకారం వివిధ ఆడిట్ రిపోర్ట్స్ ఈ-ఫైలింగ్ చేసే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలోను ఈ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ఐటీ శాఖ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.
ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త వెబ్ సైట్లో టెక్నికల్ సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తాజాగా మార్చి 15 వరకు పొడిగించింది. అయితే ఐటీ రిటర్న్స్ గడువు తేదీని పెంచే ఆలోచన లేదని గతంలో తెలిపిన కేంద్రం, తాజాగా కరోనా మహమ్మారి దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకుంది.