గుడ్ న్యూస్: కాప్ జెమినీ లో 30,000 ఉద్యోగాలు!
ఐటీ రంగంలో కొలువు సాధించాలనుకునే వారికి శుభవార్త. ఈ రంగంలోని ఫ్రెంచ్ దిగ్గజం కాప్ జెమినీ ఇండియాలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వబోతోంది. అటు ఫ్రెషర్స్ కు, ఇటు ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కూడా అవకాశం లభించనుంది. ఈ ఏడాది మొత్తంగా 30,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించింది. ఐటీ సేవలు, కన్సల్టింగ్ వంటి సర్వీసులు అందజేసే కాప్ జెమినీ కంపెనీకి ప్రపంచం మొత్తంలో ఇండియాలో నే అధిక మంది ఉద్యోగులున్నారు. ఈ కంపెనీ మొత్తం గ్లోబల్ హెడ్ కౌంట్ లో సగానికిపైగా ఇండియాలోనే పనిచేస్తుండటం విశేషం.
అందుకు అనుగుణంగానే ప్రస్తుతం మరో 30,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని వెలువరించింది. తమ వ్యాపారంలో ఇండియాది అతి ముఖ్యమైన భూమిక అని, అందుకే ఇక్కడ స్థూలంగా 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని అశ్విన్ వెల్లడించారు.
SBI షాక్: రూ.500 నుండి రూ.3,000 వరకు పెరిగిన ఆ ఛార్జీలు, చెల్లించకుంటే 40% ఫైన్
ఇండియాలో 1.15 లక్షల ఎంప్లాయిస్...
ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన బహుళజాతి కంపెనీ ఐన కాప్ జెమినీ తొలి నుంచి భారత్ పై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత ఎక్కువ మంది ఉద్యోగులను ఇండియాలో కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియాలో కాప్ జెమినీ కి సుమారు 1.15 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారు. గ్లోబల్ లెవెల్ లో ఈ సంఖ్య మొత్తం ఎంప్లాయిస్ లో సగానికిపైగా ఉండటం విశేషం. ఇండియా లో కూడా మన హైదరాబాద్ లోనూ కంపెనీకి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఐటీ అవుట్ సోర్సింగ్ సేవలు కూడా అందించే కాప్ జెమినీ కి పెద్ద సంఖ్యలో గ్లోబల్ క్లైంట్స్ ఉన్నారు. కాగా, కొత్తగా నియమించుకునే ఉద్యోగుల కోసం సరైన స్పేస్ ముంబై సహా ఇతర సెంటర్ల లో అందుబాటులో ఉందని సమాచారం.
కొత్త టెక్నాలజీల్లో శిక్షణ...
ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కొత్త టెక్నాలజీ ల వైపు దృష్టి సారిస్తుండటంతో... కాప్ జెమినీ కూడా తన ఉద్యోగులకు సరికొత్త టెక్నాలజీ ల్లో మెరుగైన శిక్షణ అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 65% నికి పైగా 30 ఏళ్ళ లోపు వయసు ఉన్నవారే. వీరంతా కొత్త టెక్నాలజీలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక 10-15 ఏళ్ళ అనుభవం కలిగిన మిడ్-లెవెల్ అనుభవం కలిగిన ఉద్యోగులను ప్రాజెక్ట్ మేనేజర్లుగా, ఆర్కిటెక్ట్ లుగా నియమిస్తున్నట్లు అశ్విన్ తెలిపారు. కంపెనీ లో ఎలాంటి పునర్వ్యవస్థీకరణ లేదని, ఉద్యోగాల కోత కూడా ఉండదని స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా సహజంగా జరిగిపోయే ఆస్ట్రిషన్ కొనసాగుతుందని చెప్పారు.
క్లయింట్ సర్వీసెస్ కే ప్రాధాన్యం..
ప్రస్తుతం క్లైంట్స్ తమ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని కోరుకుంటున్నారని అశ్విన్ తెలిపారు. అందుకు అనుగుణంగా ఉద్యోగులను కూడా వెంటనే ప్రాజెక్టుకు అసైన్ చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కొత్త టెక్నాలజీ పై శిక్షణ ఇస్తూనే ప్రాజెక్టులో వారిని భాగస్వాములను చేస్తామన్నారు. ఐటీ రంగంలో చాలా కంపెనీలు ప్రొడక్టుల రూపకల్పనపై దృష్టి సారిస్తున్నా... తాము మాత్రం వారికి మెరుగైన సేవలను అందించే నవకల్పనలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ దిశగా వివిధ అంశాల్లో 150 స్టార్టుప్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం లేదా వాటితో కలిసిపనిచేయటం జరుగుతోందన్నారు.