ఏటీఎం నుంచి రూ.100కు బదులు రూ.500 నోట్లు, పొరపాటు అక్కడే!
ఏటీఎంలలో జరిగే సాంకేతిక సమస్యల కారణంగా ఒక నోటుకు బదులు మరో నోట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా, కర్ణాటకలోని కొడగు జిల్లా కేంద్రం మడికెరిలో ఓ ఏటీఎం నుంచి రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు వచ్చాయి. ఏటీఎంకు వెళ్లి నగదు తీయగా రూ.100 విత్ డ్రా చేయాలనుకుంటే దానికి బదులు రూ.500 వచ్చింది.
IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు
రూ.100కు బదులు రూ.500... రూ.1.7 లక్షలు విత్ డ్రా
మడికెరిలోని కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి రూ.100 నోటుకు బదులు రూ.500 నోటు వస్తుందని తెలిసి చాలామంది ప్రజలు అక్కడకు వచ్చి క్యాష్ విత్ డ్రా చేసుకున్నారు. అలా మొత్తం రూ.1.7 లక్షల నగదును స్థానికులు విత్ డ్రా చేసుకున్నారు. కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకు వెళ్లిన తర్వాత విషయం తెలిసింది.
ఏం జరిగిందంటే?
ఏటీఎంలలో నగదు ఉంచేందుకు వివిధ సంస్థలు ఉంటాయి. అక్కడి కెనరా బ్యాంకు ఏటీఎంలో నగదును నింపే సంస్థ చేసిన పొరపాటు కారణంగా రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు వచ్చాయి. ఏటీఎం మిషన్లో రూ.100 నోట్లు ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లు ఉంచారు. దీంతో సమస్య వచ్చింది.
పోలీసులకు చెప్పకుండానే..
బెంగళూరుకు మడికెరి 268 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఏటీఎంలో జరిగిన పొరపాటుపై కొంతమంది బ్యాంకు దృష్టికి తీసుకు వెళ్లినా వారు మొదట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సీసీ కెమెరాల్లో క్యాష్ విత్ డ్రా చేసిన వారిని గుర్తించి బ్యాంకు అధికారులే డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరారు. విషయం తెలియగానే బ్యాంకు అధికారులు తమను సంప్రదించలేదని, వారికి వారే మనీ రీకవరీ ప్రయత్నం చేసారని కొడగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుమన్ డీ పెన్నెకార్ చెప్పారు.
అలా మొత్తం డబ్బులు తిరిగి వచ్చాయి
బ్యాంకు ఏటీఎం నుంచి రూ.1.7 లక్షలు పోయాయి. బ్యాంకు అధికారులు నేరుగా కస్టమర్లను కలిసి డబ్బులు ఇవ్వాలని కోరగా కేవలం ఇద్దరు మాత్రం ఇచ్చారు. వారిద్దరి వద్ద నుంచే రూ.65,000 తీసుకున్నారు. మరికొంతమంది కస్టమర్లు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. ఇది బ్యాంకు చేసిన పొరపాటు అఅని, తాము ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. దీంతో చేసేది లేక ఏటీఎంలో నగదు ఉంచే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో మిగతా సొమ్ము కూడా వచ్చింది.