కరోనా ఎఫెక్ట్: ఆరోగ్య రంగానికి రూ.64,180 కోట్లు, గత ఏడాదితో 137% అధికం
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఆరోగ్య రంగానికి రూ.64,180 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం ఆత్మనిర్భర్ భారత్ స్వస్థ్ యోజనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. దీనికి రూ.64వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 137 శాతం అధికంగా కేటాయించడం గమనార్హం.
ఆత్మనిర్భర్ భారత్ ఆదర్శం కొత్తది కాదని, ఈ దేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్ ఉందని నిర్మలమ్మ తెలిపారు. ఆరోగ్యవంతమైన భారత్ కోసం కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్యాకేజీ లాక్ డౌన్ ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించాయన్నారు. లాక్ డౌన్ వల్ల అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కరోనా సమయంలో ప్రకటించిన ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్లతో సమానమన్నారు. ఆస్ట్రేలియాలో టీమిండియా గెలిచినట్లు ఆర్థికరంగం పుంజుకుంటుందన్నారు.

ఎకానమీ పునరుజ్జీవానికి అన్ని అంశాలు ఈ బడ్జెట్లో ఉన్నాయన్నారు. కరోనా తర్వాత మనం మరో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామన్నారు. కరోనాపై యుద్ధం కొనసాగుతుందన్నారు. ఆరు మూలస్థంబాల మీద బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. కరోనా వ్యాక్సీన్ కోసం రూ.33వేల కోట్ల నిధులు కేటాయించామని, అవసరమైతే మరిన్ని కేటాయిస్తామన్నారు. మొదటి స్తంభం ఆరోగ్యమని చెప్పారు. పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషణ్ 2.0ను లాంచ్ చేస్తున్నట్లుతెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్కు రూ.41 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications