Budget 2021: నిర్మలమ్మ నుండి ఈ కీలక రంగాలు ఏం కోరుతున్నాయి?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వతంత్ర భారతంలోనే అతి కీలకమైన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. సామాన్యుడి నుండి సూపర్ రిచ్ వరకు, చిన్నచిన్న కంపెనీల నుండి దిగ్గజ కంపెనీల వరకు ఈ బడ్జెట్ వైపు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆయా రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రకటన ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వాన్ని కలిసి కేటాయింపులు, రాయితీల కోసం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏ రంగం ఏం ఆశిస్తుందో కొన్ని అంశాలు..
ఆటో రంగం
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగాల్లో ఆటో రంగం ఉంది. 2020 ఏప్రిల్ నెలలో అయితే కొన్ని సంస్థలు జీరో సేల్స్ నమోదు చేశాయి. ఆ తర్వాత ఆరేడు నెలలు కూడా కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ అది ఎంత వరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బడ్జెట్ పైన ఆటోసెక్టార్ కోటి ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా వాహనాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. పదిహేనేళ్ళు దాటిన వాహనాల కోసం స్క్రాప్ పాలసీ, ఉత్పత్తి ఆదారిత ప్రోత్సాహకాలు కోరుతోంది.
ఈ రంగాలు కూడా
కరోనా ప్రభావం అతి తీవ్రంగా పడిన రంగాల్లో విమానయానం, పర్యాటక రంగాలు ఉన్నాయి. తమకు మరో ఆరు నెలల మారటోరియం కావాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ కోరుతోంది. అలాగే, టర్బైన్ ఫ్యూయల్ పైన పన్ను తగ్గించాలని విమానయాన రంగం కోరుకుంటోంది. ఇక, రిటైల్ రంగంపై కరోనా కంటే ఈ-కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఆఫ్-లైన్, ఆన్-లైన్ మధ్య అంతరాన్ని తగ్గించాలని కోరుతోంది రిటైల్ రంగం. పరిశోధన, అభివృద్ధి కోసం ఖర్చుకు పెద్ద ఎత్తున రాయితీలు కావాలని ఫార్మా రంగాలు కోరుతున్నాయి.
రియాల్టీకి ఊతమివ్వాలి
కరోనా కారణంగా రియాల్టీ రంగం దెబ్బతిన్నది. గత రెండు నెలలుగా ప్రీ-కోవిడ్ స్థాయి దిశగా కనిపిస్తున్నాయి. ఈ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు రాయితీలు కోరుతోంది. శాలరైడ్ హోంలోన్ను ప్రోత్సహించేందుకు కొనుగోలుదారులకు సెక్షన్ 80సీ కింద ఉన్న పరిమితిని పెంచాలని కోరుతున్నారు.