అదానికి రూ.వేల కోట్లు నష్టం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలతో ముగిసింది. స్టాక్స్ అన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అయ్యాయి. దాదాపుగా అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్లన్నీ అప్పర్ సర్క్యుట్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు లాభాల బాటను పండించాయి. వారం ప్రారంభ రోజున స్టాక్ మార్కెట్స్ కార్యకలాపాలు సానుకూలంగా ముగియడం.. ఆశలను రేకెత్తించింది. ఈ వారం అంతా మార్కెట్స్ లాభాల్లో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఓపెనింగ్ సెషన్లో 150 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. క్రమంగా పెరుగుతూ పోయింది. తొలి గంటలో 217 పాయింట్ల మేర లాభపడి, 62,288.59 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదయింది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్టాక్స్ ఏ దశలో కూడా సెన్సెక్స్ బలహీనపడలేదు. కీలకమైన సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్లన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అయ్యాయి.

దీనికి భిన్నంగా అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. యాంకర్ కంపెనీ అదాని ఎంటర్ప్రైజెస్ సహా అన్ని కంపెనీల షేర్లూ రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి. అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పోర్ట్స్ అండ్ సెజ్, అదాని పవర్, అదాని టోటల్ గ్యాస్, అదాని ట్రాన్స్మీషన్, అదాని విల్మార్ షేర్లు నష్టపోయాయి.
అదాని ఎంటర్ప్రైజెస్ ఒక్కో షేర్ మీద రూ.54.70 పైసల మేర నష్టపోయి, 1,910 రూపాయల వద్ద ట్రేడింగ్ ముగిసింది. అదాని గ్రీన్ ఎనర్జీ రూ.26.60 పైసల మేర నష్టపోయి 869 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అదాని పోర్ట్స్ అండ్ సెజ్.. ఏడు రూపాయల మేర నష్టపోయి 693 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అదాని పవర్ అయిదు రూపాయల మేర నష్టపోయి రూ.235.65 పైసలు, అదాని టోటల్ గ్యాస్ రూ.40.90 పైసల మేర నష్టపోయి 777.45 పైసల వద్ద ట్రేడ్ అయ్యాయి.
అదాని ట్రాన్స్మీషన్ లిమిటెడ్ షేర్లదీ అదే పరిస్థితి. ఇది ఏకంగా రూ.44.20 పైసల మేర నష్టపోయింది. రూ.840.60 పైసల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్కు చెందిన అదాని విల్మార్ షేర్లు కూడా నష్టపోయాయి. ఒక్కో షేర్ మీద రూ.5.20 పైసల మేర నష్టం మిగిల్చింది. రూ.386.55 పైసల వద్ద ట్రేడ్ అయింది.

మొత్తంగా అదాని గ్రూప్ కంపెనీలు ఈ ఒక్కరోజే 21,000 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. అదాని-హిండెన్బర్గ్ నివేదిక విషయంలో సెబి తన దర్యాప్తును కొనసాగిస్తోండటమే కారణం. విచారణలో భాగంగా- సెబి ఇవ్వాళ సుప్రీంకోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్ను దాఖలు చేసింది.
2016 నుంచీ గౌతమ్ అదాని సంస్థలపై తాను దర్యాప్తు సాగిస్తోన్నానంటూ వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి దర్యాప్తు కూడా జరపట్లేదని స్పష్టం చేసింది. ఈ దర్యాప్తు వార్తల్లో వాస్తవం లేదని, నిరాధారమైనవని పేర్కొంది. అలాగే అదాని-హిండెన్బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి సుప్రీంకోర్టు రెండు నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో- దీన్ని ఆరు నెలల గడువు ఇవ్వాలని సెబి విజ్ఞప్తి చేసింది.


Click it and Unblock the Notifications