ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్(BTA) కోసం భారతదేశం - అమెరికా త్వరలోనే చర్చలను ప్రారంభించనున్నాయి. అయితే ఈ చర్చలు వర్చువల్ మోడ్లో జరుగనున్నాయి. ఈ విషయంపై భారత బృందం కూడా వచ్చే నెలలో అమెరికాకు వెళ్లనుంది. ఈ ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నాటికి అమలు అయ్యేలా, దీనికంటే ముందే చర్చలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 9 నుండి ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసందే. అయితే తరువాత దానిని 90 రోజులు అంటే జూలై 9 వరకు వాయిదా వేశారు. భారతీయ వస్తువులపై అమెరికా 26% సుంకం విధించింది. దీనిపైనే ఈ చర్చలు కొనసాగనున్నాయి. మరోవైపు 2030 నాటికి బైలాటరల్ ట్రేడ్ $500 బిలియన్లకు తీసుకెళ్లడానికి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి ఫిబ్రవరి 13న భారతదేశం - అమెరికా అంగీకరించాయి .
వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు ఈ వారం వర్చువల్ మోడ్లో ప్రారంభమవుతాయి అని మంత్రిత్వ శాఖ అధికారి కూడా తెలిపారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ మే రెండవ వారంలో భౌతికంగా చర్చలు ప్రారంభమవుతాయి అని అన్నారు.
మార్చి నెల ఎగుమతి గణాంకాల పై సమాచారం ఇస్తూ వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ సుంకాలన్ని పరిశీలిస్తే భారతదేశానికి ఆందోళన కలిగించే విషయాలు ఇంకా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికాతో ట్రేడ్ లిబరలైజేషన్ దిశగా భారతదేశం ఇప్పటికే అడుగులు వేసింది. అమెరికాతో ఇండియా మంచి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటుందని ఆశిస్తున్నాము అని అన్నారు.
భారతదేశం - యూరోపియన్ యూనియన్ మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై నెక్స్ట్ రౌండ్ చర్చలు మే 12న ప్రారంభమవుతాయి. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చర్చలు వస్తువులు, సేవలు, పెట్టుబడులు ఇంకా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ వంటి రంగాలపై దృష్టి సారించాయని అలాగే చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు.
అమెరికా పరస్పర సుంకాలు భారతదేశం కంటే ఎక్కువగా ఉండటం వల్ల చైనా, వియత్నాం వంటి దేశాల నుండి వస్తువులను భారతదేశంలో డంప్ చేసే ప్రమాదం ఉన్నందున, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దిగుమతులు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని మానిటరింగ్ టీంని ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా అసాధారణ దిగుమతులు గమనించినట్లయితే, మేము తగిన చర్య తీసుకుంటాము అని అన్నారు.


Click it and Unblock the Notifications