Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ పతనం: షేర్లు అమ్ముకుంటోన్న స్టార్ ఇన్వెస్టర్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్ఝున్వాలా పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. స్టార్ ఇన్వెస్టర్గా గుర్తింపు పొందారు. ఇండియన్ వారెన్ బఫెట్గా పిలుస్తారు. షేర్ మార్కెట్లో ఆయన వేసే అంచనాలు నిజం అవుతుంటాయని చెబుతుంటారు. షేర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని అంచనా వేయడంలో దిట్ట. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు.
ఇలా ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోలు లాభాల బాటలో పట్టాయి. అలాంటి ఏస్ స్టాక్ ఇన్వెస్టర్- తాను పెట్టుబడులు పెట్టిన షేర్లను క్రమంగా అమ్ముకుంటోన్నారు. ప్రత్యేకించి- తన వద్ద ఉన్న డెల్టా కార్ప్ షేర్లను ఖాళీ చేసేస్తున్నారు. కిందటి నెలలో డెల్టా కార్ప్కు చెందిన 25 లక్షల షేర్లను ఆయన స్టాక్ మార్కెట్లో సేల్ చేశారు. ఇప్పుడు మళ్లీ మరో ఆరుశాతం మేర కోత పెట్టారు.
ఆయన భార్య రేఖా ఝున్ఝున్వాలా కూడా 3.25 శాతం మేర డెల్టా కార్ప్ షేర్లను అమ్మి వేశారు. డెల్టా కార్ప్కు మాత్రమే పరిమితం కాలేదాయన. టైటాన్ షేర్లను విక్రయించారు. తాను హోల్డ్ చేసి ఉంచిన టైటాన్ షేర్లల్లో ఆరుశాతం మేర విక్రయించారు. టాప్ ఫార్మాసూటికల్ కంపెనీలు లూపిన్, అరబిందో స్టాక్స్ కూడా రాకేష్ ఝున్ఝున్వాలా అమ్మివేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆయన హోల్డ్ చేసి ఉంచిన షేర్లల్లో టైటాన్-6, యునైటెడ్ స్పిరిట్స్-4, ఎస్కార్ట్స్-2, క్రిసిల్-4.4, టాటా మోటార్స్-1.6, మెట్రో బ్రాండ్స్-1.4, స్టార్ హెల్త్-4 శాతం మేర ఉన్నట్లు తెలుస్తోంది. కిందటి నెలలో అయిదు రోజుల వ్యవధిలో డెల్టా కార్ప్కు చెందిన షేర్లను రాకేష్ ఝున్ఝున్వాలా అమ్మేసిన విషయం తెలిసిందే.
దీనికి కారణం- స్టాక్ మార్కెట్లో నెలకొన్న పతనావస్థే కారణమనే ప్రచారం ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రారంభమైన ఈ పతనం.. ఇవ్వాళ్టికీ ఇన్వెస్టర్లను వణికిస్తోంది. లాభాలు అనే మాట అటుంచి.. పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. మైనస్లల్లో పడిపోయాయి.
తన వాటాను 6.2కు కుదించుకున్నారు రాకేష్ ఝున్ఝున్వాలా. 0.9 శాతంతో ఏకంగా 25 లక్షల షేర్లను విక్రయించారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే రెగ్యులేటరీకి తెలియజేశారు. టాటా గ్రూప్స్కు చెందిన టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, రేటింగ్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ క్రిసిల్ వంటి పలు కంపెనీల్లో షేర్లను హోల్డ్ చేశారు.
గత ఏడాదిలో టాటా మోటార్స్ ద్వారా ఆయన 17.82 కోట్ల రూపాయలను ఆర్జించారు. ఇందులో రాకేష్ ఝున్ఝున్వాలాకు 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇండియన్ హోటల్స్-రూ.31.13 కోట్లు, క్రిసిల్-రూ. 21.72 కోట్లు, ఎస్కార్ట్స్-రూ.451 కోట్ల రూపాయల ప్రాఫిట్ను ఇచ్చాయి.