జీతంలో రూ.8 లక్షలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నా, రోడ్ల మీద నరకం చూస్తున్నా.. బెంగళూరు ట్రాఫిక్పై హాట్ డిబేట్
భారతదేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా భారత ఐటీ రాజధాని బెంగళూరు ఈ సమస్యకు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. దేశానికి సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఈ నగరంలో ఐటీ ఉద్యోగులు మంచి జీతాలు సంపాదిస్తున్నారు. అయితే అదే సమయంలో, వారు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ రద్దీ వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. పన్నులు చెల్లిస్తూనే సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితి వారికి అసహనంగా మారుతోంది.
ఇటీవల ఒక టెక్ ఉద్యోగి రెడ్డిట్లో దీనిపై పెట్టిన పోస్ట్ ఈ సమస్యను మళ్లీ అందరి దృష్టికి తీసుకువచ్చింది. ఆ టెకీ బెంగళూరులోని జెపి నగర్లో నివసిస్తూ, ఔటర్ రింగ్ రోడ్లోని ఆఫీసుకు వెళ్తారు. ఇంటి నుంచి కార్యాలయం దూరం కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. సాధారణంగా అరగంటలో చేరాల్సిన ఈ దూరం.. రోజూ ఆయన ప్రయాణించడానికి దాదాపు 90 నిమిషాలు పడుతోంది. అంటే ఒక రోజు వెళ్లి రావడానికి మూడున్నర గంటలు సమయం ట్రాఫిక్లో వృథా అవుతోంది.

ఆ ఉద్యోగి తన పోస్ట్లో ట్రాఫిక్ రద్దీని దాచిన పన్ను అని వర్ణించారు. ప్రజలు ఇప్పటికే ఆదాయపన్ను, జీఎస్టీ వంటి భారమైన పన్నులు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత, ట్రాఫిక్లో కూరుకుపోవడం వల్ల సమయాన్ని కూడా కోల్పోతున్నారు. ఈ సమయం కోల్పోవడం వాస్తవానికి వారి ఉత్పాదకతను తగ్గిస్తోంది. ఒక విధంగా ఇది పన్నులకన్నా ఎక్కువ నష్టం కలిగిస్తోందని తెలిపారు. ఈ టెక్ ఉద్యోగి సంవత్సరానికి రూ. 28 లక్షలు (RSUలు మినహా) సంపాదిస్తున్నప్పటికీ, తన డబ్బు, సమయంలో ఎక్కువ భాగం పన్నులు, ట్రాఫిక్కే వెళ్తోందని చెప్పాడు.
ఆదాయపు పన్ను రూపంలో రూ. 6.5 లక్షలు, GSTలో రూ. 1.4 లక్షలు చెల్లిస్తున్నాను. అదనంగా, నా జీవితంలో ప్రతి సంవత్సరం మూడు నెలల సమయాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లే అనిపిస్తోందని ఆయన పేర్కొన్నాడు. ట్రాఫిక్లో గడిపే 2.5 నెలలను కలిపితే, మొత్తం మీద తన జీవితంలో దాదాపు ఆరు నెలలు కనిపించే, కనిపించని పన్నులు కింద వృథా అవుతున్నాయని ఆయన అంచనా వేశారు. పన్నులు వసూలు చేయడం వల్ల మెరుగైన రోడ్లు, స్మార్ట్ సిటీ సౌకర్యాలు లభించాలి. కానీ వాస్తవం మాత్రం తప్పుగా నిర్వహించబడిన ప్రణాళికలు, ప్రతి రోజు శిక్షలా మారిన రోడ్లే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్పై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఒక ఇంజనీర్ను స్వచ్ఛమైన గాలి, ట్రాఫిక్ లేని నగరానికి పంపితే, ఎటువంటి మార్పు లేకుండానే అతను 20శాతం ఎక్కువ పని చేస్తాడని ఓ నెటిజన్ అన్నారు. దీని అర్థం ట్రాఫిక్ వల్ల ఉద్యోగులు తక్కువగా పనిచేస్తారని, వారి పనితీరు పడిపోతుందని స్పష్టమవుతోంది.
మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ అందరూ బెంగళూరుకు వస్తున్నారు. ఇక్కడ దుబాయ్ లాంటి సౌకర్యాలు కోరుతున్నారు. కానీ చిన్న నగరాల్లో పెట్టుబడులు పెట్టడం లేదని అన్నారు. అంటే, ఐటీ రంగం మొత్తం Bengaluru లోనే కేంద్రీకృతం కావడం వల్ల నగరంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం చిన్న పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తే ఈ సమస్య కొంతవరకు తగ్గవచ్చన్నారు. కొంతమంది నెటిజన్లు పౌరుల ప్రవర్తనను కూడా కారణంగా పేర్కొన్నారు. తప్పు పార్కింగ్, సర్వీస్ రోడ్లలో నియమాలు పాటించకపోవడం వంటి అంశాలు రద్దీని మరింత పెంచుతున్నాయి. అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, పౌరుల సహకారం కూడా అవసరమని నొక్కి చెప్పారు.
ఇక ఈ సమస్య Bengaluru తో మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబై, కోల్కతా. హైదరాబాద్ వంటి ఇతర మెట్రో నగరాలు కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వేగంగా పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల అధిక సంఖ్య, సరైన ప్రజా రవాణా సౌకర్యాల లేమి, పేలవమైన రోడ్ల ప్రణాళిక అన్నీ కలసి ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు సమయం వృథా చేసుకోవడం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ, పర్యావరణానికీ నష్టం కలుగుతోంది. వాహనాల నుంచి అధికంగా వెలువడే కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. అలాగే, ఆఫీసు వెళ్లే సమయం ఎక్కువ కావడం వల్ల ఉద్యోగుల పనితీరు తగ్గిపోతోంది.


Click it and Unblock the Notifications


