అదే జరిగితే... ఇండియన్ బ్యాంకింగ్, రైల్వే సేవలకు ఇబ్బందులు?
అమెరికా శాటిలైట్ బ్రాడ్బాండ్ ప్రొవైడర్ హ్యూస్ నెట్ వర్క్ సిస్టమ్స్ ఇండియాలో తన ఆపరేషన్స్ను క్లోజ్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది వేలాది బ్యాంకింగ్ సేవలను ప్రమాదంలో పడేస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెల్లించని సుంకాల కారణంగా ఇది తన కార్యకలాపాలను మూసివేసేందుకు సన్నద్ధమవుతోంది. AGR బకాయిల నేపథ్యంలో వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
హ్యూస్ ఇండియా భారత్లో డిఫెన్స్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ సెక్టార్లకు సేవలు అందిస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీన కేంద్ర టెలికం శాఖకు హ్యూస్ నెట్ వర్క్ సిస్టమ్స్ లేఖ రాసింది. ఇందులో రూ.600 కోట్లకు గాను దివాళా అంశాన్ని ప్రస్తావించింది. ఒకవేళ ఇది తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తే దాదాపు 70,000 బ్యాంకింగ్ లొకేషన్స్కు కనెక్టివిటీ అంతరాయం ఏర్పడవచ్చు.
కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం
అంతేకాదు, ఇండియన్ నేవీ, ఆర్మీ, రైల్వేస్ వంటి అనేక క్లిష్టమైన ఉపగ్రహ నెట్ వర్క్స్లో కనెక్టివిటీ అంతరాయం ఏర్పడవచ్చునని హ్యూస్ ఇండియా అద్యక్షులు పార్థో బెనర్జీ ఈ లేఖలో ప్రస్తావించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వివిధ కారణాలు తమ కంపెనీని దివాలా, మూసివేత దిశగా నెడుతున్నాయని బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని విజ్ఞప్తిగా పేర్కొన్నారు.
ప్రభుత్వం దశాబ్దం క్రితం నాటి లెక్కలు వేసిందని, వీటికి వడ్డీలు జత చేసిందని, దీంతో 84 మిలియన్లకు (రూ.600 కోట్లు) పెరిగిందని పేర్కొన్నారు. అయితే భారతదేశంలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తామని, వినియోగదారులకు సేవలు అందిస్తూనే ఉంటామని హ్యూస్ తెలిపినట్లుగా కూడా పేర్కొంటున్నారు.