ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఛార్జీలు పెంపు: రిజర్వుబ్యాంక్ పెట్టిన ముహూర్తం ఇదే
ముంబై: ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. క్యాలెండర్ మారబోతోంది. దీనికి అనుగుణంగా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి రాబోతోన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో ఒకటి- ఏటీఎం నగదు విత్ డ్రా ఛార్జీల పెరుగుదల. ఉచిత పరిమితిని దాటి ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే ప్రతి నగదు లావాదేవీలపైనా వసూలు చేసే సర్వీసు ఛార్జీలను బ్యాంకులు పెంచేశాయి. జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది.
ఏటీఎం విత్ డ్రా ఛార్జీలను పెంచాలని కోరుతూ బ్యాంకులు దాఖలు చేసిన ప్రతిపాదనలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే కస్టమర్ల నుంచి ఇప్పటిదాకా వసూలు చేసే సర్వీసు ఛార్జీలను బ్యాంకులు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. అధిక ఛార్జీలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమలు అవుతుందని పేర్కొంది. అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు దీన్ని వర్తింపజేసింది.
రిజర్వుబ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా.. 2022 జనవరి 1 నుంచి ఏటీఎంలల్లో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు చేస్తే 21 రూపాయలను బ్యాంకులు వసూలు చేస్తాయి. ప్రతి బ్యాంక్ నెలకు గ్రామీణ ప్రాంతాల్లో అయిదు, నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. ఈ పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసే ప్రతీసారీ ఒక్కో లావాదేవీపై అదనంగా 20 రూపాయలను వసూలు చేస్తోన్నాయి.
దీనికి పన్నులు అదనం. జనవరి 1వ తేదీ నుంచి విత్ డ్రా చేసుకునే ప్రతి ట్రాన్సాక్షన్పైనా 21 రూపాయలను వసూలు చేస్తాయి బ్యాంకులు. దీనికి పన్నులు అదనం. బ్యాంకులకు మరింత ఆర్థిక పరిపుష్టిని కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇదే విషయాన్ని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పష్టం చేశాయి. తమ ఆధీకృత వెబ్సైట్స్పై దీన్ని పొందుపరిచాయి. పరిమితికి మించిన ఏటీఎం విత్ డ్రాలపై వసూలు చేసే సర్వీసు ఛార్జీలను జనవరి 1వ తేదీ నుంచి పెంచినట్లు పేర్కొన్నాయి.