Anil Ambani: ఒకప్పుడు భారత వ్యాపార ప్రపంచంలో వెలుగువెలిగిన అంబానీ సోదరుడు అనిల్ కుప్పకూలటం అందరం గమనించాం. ఇదే సమయంలో సోదరుడు ముఖేష్ మాత్రం తన వ్యాపారాలను అనేక రెట్లు పెంచుకుని దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.
తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ విదర్భ ఇండస్ట్రీస్ పవర్ రుణదాతలకు తన లోన్స్ క్లియర్ చేయడానికి రూ.1200 కోట్ల వన్-టైమ్ సెటిల్మెంట్ను ప్రతిపాదించిందని అంతర్గత వర్గాల ద్వారా వెల్లడైంది. ప్రముఖ వార్తా సంస్థలు సైతం దీనిపై నివేదించాయి. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈలో లాభపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టాక్ ధర రూ.11.55 వద్ద కొనసాగుతోంది.

రుణాల చెల్లింపునకు రిలయన్స్ పవర్ వన్-టైమ్ సెటిల్మెంట్ ఆఫర్కు గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ వెర్డే పార్ట్నర్స్ అంగీకరించినట్లు సమాచారం. రిలయన్స్ పవర్ సెప్టెంబర్ 2022లో రూ.1200 కోట్ల వరకు రుణాన్ని పొందేందుకు వెర్డే పార్ట్నర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. జూన్ 2021లో వెర్డే పార్ట్నర్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రూ.550 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థ అనేక ఇతర పవర్ కంపెనీల్లో సైతం తన పెట్టుబడులను కలిగి ఉంది.
రిలయన్స్ పవర్ ప్రతిపాదన ప్రకారం యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహా రుణదాతలకు రిలయన్స్ పవర్ రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉంది. విదర్బ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి విదేశీ కరెన్సీలతో పాటు దేశీయ కరెన్సీల్లో టర్మ్ లోన్స్ పొందింది. మార్చి 31, 2023 నాటికి రిలయన్స్ పవర్ మెుత్తం రుణ బకాయిలు రూ.2,216.43 కోట్లుగా ఉంది.
కంపెనీ పవర్ ప్లాంట్లు జనవరి 2019 నుంచి పనిచేయడం లేదు. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబైతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం 16 డిసెంబర్ 2019 నుంచి రద్దు చేయబడింది. దీంతో గత కొన్నేళ్లుగా ఈ పవర్ ప్లాంట్ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది.


Click it and Unblock the Notifications