మీకు తెలుసా... మనందరి సంపద 10% పెరిగిందట!
అవును, మీరు చదువుతున్నది నిజమే. భారత్ లో వ్యక్తుల (ఇండివిడ్యుల్ ) సంపద దాదాపు 10 శాతం పెరిగిందట. ఆర్థిక సేవలు అందించే కార్వీ ... 2019 సంవత్సరానికి గాను పరిశోధన లో ఈ విషయం వెల్లడైంది. కార్వీ ప్రైవేట్ వెల్త్ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2019 లో భారతీయ వ్యక్తుల సంపద 9.62% పెరిగి అక్షరాలా రూ 430 లక్షల కోట్లకు చేరుకొంది. ఆర్థిక మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశమే.
ఒక ఏడాదిలోనే సుమారు పది శాతం వృద్ధి సాధించటం నిజంగానే మన పౌరుల పొదుపు, పెట్టుబడుల సరళి చాలా పటిష్టంగా ఉందని స్పష్టం ఐంది. అయితే, పెరిగిన సంపదలో ఎక్కువ భాగం ఆర్థిక పరమైన పెట్టుబడి సాధనాల నుంచే అధిక వృద్ధి లభించిందట. స్థిరాస్తులు, బంగారం వంటి ఫిసికల్ అసెట్స్ పై పెట్టిన పెట్టుబడి పై రాబడి కాస్త తక్కువగా ఉండటం గమనార్హం. అంటే, భారతీయులు క్రమంగా అభివృద్ధి చెందిన దేశాల పెట్టుబడి సరళిని అందిపుచ్చుకొంటున్నారని తెలుస్తోంది.
60 శాతానికి పైగా అందులోనే...
భారతీయులు తమ సంపద పెంచుకునేందుకు మదుపు మార్గాలను క్రమంగా మార్చుకొంటున్నారు. ఐదేళ్ల క్రితం 57.25% మొత్తం పెట్టుబడులు ఆర్థికపరమైనవి కాగా... 2019 లో వాటి వాటా 60.95% నికి పెరిగింది. అందునా రాబడిలో కూడా 10.96% పెరుగులతో ఈ రంగం దూసుకుపోతోంది. డైరెక్ట్ ఈక్విటీ ... అంటే కంపెనీల్లో మూలధన పెట్టుబడులు లేదా షేర్ల కొనుగోలు వైపు వ్యక్తులు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. దీన్నిబట్టి చూస్తే మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా వ్యక్తులు మదుపు చేయగలుగుతున్నారని స్పష్టం అవుతోంది. మొత్తం పెట్టుబడుల్లో 6.39 శాతం వాటా తో డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడులు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్స్, సేవింగ్స్ అకౌంట్లు, నగదు వంటి పెట్టుబడి సాధనాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయ్. మొత్తం ఆర్థికపరమైన పెట్టుబడుల్లో వీటి వాటా 72.33 శాతంగా ఉంది.
భూమి, బంగారం...
ఫిసికల్ అసెట్స్ లో పెట్టుబడుల కోసం భారతీయ మదుపరులు ... భూములు, ఇండ్లు (రియల్ ఎస్టేట్), బంగారం పై అధికంగా ఆధారపడుతున్నారు. మొత్తం ఈ రంగంలోని పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, గోల్డ్ లో 92.57 శాతం మదుపు చేశారు. స్థిరాస్తుల్లో భారతీయుల పెట్టుబడుల మొత్తం విలువ రూ 167 లక్షల కోట్లుగా నమోదు ఐంది. అయితే, ఈ రంగంలో పెట్టిన పెట్టుబడులపై రాబడి 7.59% మేరకు వృద్ధి చెందింది. సహజంగా భారతీయుల పెట్టుబడి తొలి ప్రాధాన్యత ఈ రెండింటికే ఉండేది. కానీ కాల క్రమంలో పెట్టుబడి సరళి పూర్తిగా మారిపోతోందని కార్వీ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఐదేళ్ళలో రెట్టింపు ...
భారతీయుల పెట్టుబడి సరళి ఇలాగే కొనసాగితే ... మరో ఐదేళ్ళలోనే మనందరి సంపద రెట్టింపు అవుతుందని కూడా కార్వీ పరిశోధన అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని వ్యక్తుల సంపదను రూ 430 లక్షల కోట్లుగా లెక్క కట్టింది. ఈ మొత్తం 2024 నాటికి అక్షరాలా రూ 799 లక్షల కోట్లకు పెరుగుతుందట. ఈ ఐదేళ్ళలో సగటున 13.19% వృద్ధి రేటు నమోదు అవుతుందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో మన మొత్తం ఆర్థికపరమైన పెట్టుబడుల వాటా 66% నికి పైగా చేరుకొంటుందని, స్థిరాస్తుల వాటా 34% నికి పడిపోతుందని అంచనా వేసింది. అర్బన్ ఇండియా ... సెమి అర్బన్ ఇండియా తో పాటు గ్రామీణ భారతం సంయుక్తంగా దీనిని సాధించగలదని కార్వీ నివేదిక విశ్వాసం వ్యక్తం చేసింది. ది ఎకనామిక్ టైమ్స్ లో ఈ పరిశోధన కథనం ప్రచురితమైంది. ప్రస్తుత ఆర్టికల్ కు మూలం అదే.