నిన్న ఉల్లి, నేడు టమాటో ధరతో జేబులకు చిల్లు: అక్కడ కిలో రూ.80
న్యూఢిల్లీ: నిన్నటి వరకు ఉల్లి ధర ఆకాశాన్ని అంటింది. కొన్ని ప్రాంతాల్లో రూ.80 కూడా దాటింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ధర తగ్గింది. నిన్నటి వరకు ఉల్లి ధర కంట నీరు పెట్టించగా, ఇప్పుడు టమాటో ధర వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కిలో టమాటో ధర రూ.80 పలికింది. టమాటాను పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాలు రావడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ధరలు మండిపోయాయి.
ఢిల్లీలోని ప్రధాన మార్కెట్లలో హోల్ సేల్ టమాటో ధర రూ.58 పలుకగా, రిటైల్ వ్యాపారులు నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల హోల్ సేల్ కిలో రూ.35 నుంచి రూ.50 పలుకగా, రిటైల్ రూ.55 నుంచి 77 పలికింది. కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో టమాటోను బాగా పండిస్తారు. వర్షాల కారణంగా ఇక్కడి నుంచి రవాణాకు అంతరాయం కలిగింది.
ఆ బ్యాంకులతో జాగ్రత్త, ముందుగా ఇవి తెలుసుకోండి!
సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఢిల్లీలో బుధవారం టమాటో రిటైల్ యావరేజ్ ధర కిలోకు రూ.54. అక్టోబర్ 1వ తేదీన ఈ ధర రూ.45గా ఉంది. అంటే దాదాపు రూ.10 పెరిగింది.
టామాటోను పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, వరదలు రావడం వంటి కారణాలతో సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడిందని, దీంతో నాలుగైదు రోజులుగా ధరలు పెరుగుతున్నాయని ఓ వ్యాపారస్తుడు చెప్పారు. ఈ వర్షాలకు పంట దెబ్బతినడం కూడా ఓ కారణమన్నారు. బుధవారం కోల్కతాలో కిలో టమాటో ధర రూ.54 నుంచి రూ.60, ముంబైలో రూ.40 నుంచి రూ.54, చెన్నైలో రూ.40 వరకు పలికింది.