కేసీఆర్ కుట్ర, రూ.60వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కన్నుపడిందా, ఎందుకిలా!?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. వారికి ఒక్క రోజు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఆదివారం సాయంత్రం అందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. దాదాపు 48,000 నుంచి 50,000 మంది ఉద్యోగులపై వేటు పడింది. కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే ఉంటారని కేసీఆర్ తేల్చి చెప్పారు. మిగతా వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని చెప్పారు. కానీ యూనియన్ల బ్లాక్ మెయిల్కు తలొగ్గమన్నారు.
జగన్ ఇచ్చే రూ12,500 రైతుభరోసాలో మోడీ ప్రభుత్వం వాటా రూ6,000!
రూ.60 వేల కోట్ల ఆస్తులపై కేసీఆర్ కన్ను!
సస్పెండ్ చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నుపడిందని, అందుకే ఆయన సంస్థను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సంస్థకు చెందిన సుమారు రూ.60వేల కోట్ల స్థిరాస్తులను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు.
అందులో భాగంగానే సగం ప్రయివేటీకరణ
ఆర్టీసీ ఆస్తులపై కన్నుపడినందునే సీఎం దానిని ప్రయివేటీకరించాలని నిర్ణయం తీసుకున్నారని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. సగం ప్రయివేటు బస్సులు తీసుకునే ఉద్దేశం ఈ కుట్రలో భాగమే అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు క్రమబద్ధ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు సంపాదించారని, రాజకీయ నేతలు మంత్రులు, చైర్మన్స్గా కాలేదని విమర్శించారు. క్రమబద్దంగా నియమితులైన ఉద్యోగులను ఎలా తొలగిస్తారన్నారు. సమ్మె తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కూలదోస్తారా అన్నారు.
సమ్మె తీవ్రరూపం దాల్చడం వెనుక...
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తీవ్రరూపం దాల్చడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అన్నారు. సంస్థలో ఉద్యోగ విరమణలకు సమాన సంఖ్యలో నియామకాలు జరపకపోవడం, బస్సులు తగ్గించడం, సర్వీసులు కుదించడం వంటి పరిణామాలు సంస్థను నిర్వీర్యం చేయడంలో భాగమే అన్నారు. ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా సమ్మెలోకి నెట్టిందన్నారు. ఆర్టీసీని మూసివేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.
2600 అద్దె బస్సుల కొనుగోలు ప్రయత్నాల వెనుక...
ఆర్టీసీని ప్రయివేటుపరం చేసే కుట్ర సాగుతోందని, 2600 అద్దె బస్సుల కొనుగోలు ప్రయత్నాలు అందుకేనని అశ్వత్థామ రెడ్డి విమర్శించారు. ప్రయివేటు చేతుల్లో పెట్టేందుకు అద్దెబస్సుల కొనుగోలు అన్నారు. తమ పోరాటం జీతభత్యాల కోసం కాదని, జీవితాల బాగు కోసం అన్నారు.
ఆర్టీసీని కొల్లగొట్టేందుకు కేసీఆర్ పెద్ద కుట్ర
తెలంగాణ బీజేపీ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంది. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్కు కన్ను పడిందని, అందుకే ప్రయివేటుపరం అంటున్నారని, డీజిల్, పెట్రోల్ బంకులు కేసీఆర్ సన్నితుల పరమయ్యాయని, భవిష్యత్తులో ఆర్టీసీ ఆస్తులు కూడా కాజేస్తారని ఆరోపించారు. బీనామీలతో టెండర్లు వేయించి ఆర్టీసీని కొల్లగొట్టేందుకు కేసీఆర్ పెద్ద కుట్రకు తెరలేపారన్నారు. ఆర్టీసీకి చెందిన రూ.2400 కోట్ల రుణ భారం భరించలేని కేసీఆర్, రాష్ట్రం కోసం తెచ్చిన రూ.3 లక్షల కోట్లు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్, మెఘా కృష్ణారెడ్డి కలిసి ఆర్టీసీని అమ్ముకోవడానికి సిద్ధమయ్యారన్నారు. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏడాదికి రూ.1200 కోట్ల నష్టం
ఆర్టీసీకి ఏడాదికి రూ.1200 కోట్ల నష్టం వస్తోందని, వేతనాల కోసం రూ.2400 కోట్లు అవుతోందని, రూ.5000 కోట్ల రుణభారం ఉందని, పెరుగుతున్న డీజిల్ ధరలు వంటి ఇబ్బందులతో సతమతమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో చట్ట విరుద్దంగా, అదీ పండుగ సమయంలో సమ్మెకు దిగిన ఉద్యోగులతో రాజీపడే సమస్య లేదని, కాబట్టి సమ్మెలో పాల్గొన్న వారిని విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని, ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగుల లోపేనని కేసీఆర్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు...
ఏడాదికి వేల కోట్ల నష్టం వస్తుందన్న ప్రభుత్వం వాదనపై ఆర్టీసీ ఉద్యోగులు, విపక్షాల వాదన మరోలా ఉంది. ఆర్టీసీకి రూ.3,000 కోట్ల అప్పులు ఉన్నాయని, కానీ ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రావాల్సినవి రూ.2,000 కోట్లకు పైగా ఉన్నాయని, ఆ నిధులు ఇస్తే ఆర్టీసీ నష్టాలు తగ్గుతాయని చెబుతున్నారు. ఆ ఫండ్స్ ఇవ్వకపోవడమే కాకుండా ఆర్టీసీని ప్రయివేటుపరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
2500 బస్సులు అద్దెకు
మరోవైపు, పండుగ సమయంలో సమ్మె నేపథ్యంలో తక్షణమే 2500 బస్సుల్ని అద్దెకు తీసుకుని నడపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 1,22,58,433 వివిధ రకాల ప్రయివేటు వాహనాలు ఉన్నాయని, ఇవన్నీ ప్రజల రవాణాకు ఉపయోగపడేవే అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు.
సమ్మె ఎఫెక్ట్.. కొత్త వారికి అవకాశం..
సమ్మె నేపథ్యంలో కొత్త ఉద్యోగులను తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. కొత్తవారి నియామక ప్రక్రియ అతి త్వరగా పూర్తి కావాలన్నారు. కొత్తగా చేరే సిబ్బంది యూనియన్లలో చేరబోమని ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని స్పష్టం చేశారు. కొత్త సిబ్బంది నియామకం షరతులతో కూడి ఉంటుందని, అందుకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని చెప్పారు. ఏయే కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారో ఆయా సిబ్బందిని భర్తీ చేసేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం పదిహేను రోజుల్లో ఆర్టీసీ పూర్వ స్థితికి రావాలన్నారు.
సగం ప్రయివేటు...
తెలంగాణలో మరో 4వేలకు పైగా ప్రయివేటు బస్సులు ఉన్నాయని, వాటిని స్టేజ్ క్యారేజీలుగా చేస్తే అవి కూడా ఆర్టీసీలోకి వస్తాయని కేసీఆర్ చెప్పారు. దీనిపై ఆర్టీసీ, ట్రాన్సుపోర్ట్ అధికారులు చర్చిస్తున్నారని, ఆర్టీసీ నడపబోయే బస్సులలో సగం ప్రయివేటు బస్సులు ఉంటాయని, అప్పుడు రెండు మూడు సంవత్సరాల్లో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు.