నొక్కేస్తున్నారు: మోడీపై రఘురాం రాజన్ ఆగ్రహం, 2008 వంటి మాంద్యం వస్తుందా అంటే...
కేంద్ర ప్రభుత్వ విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వివిధ సందర్భాల్లో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విధానాలపై ఆయన తాజాగా మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాలసీలను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహించారు. ఈ మేరకు ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు.
ఏటీఎం క్యాష్ ఉపసంహరణ కొత్త రూల్స్ తెలుసుకోండి
గొంతు నొక్కేస్తున్నారు..
మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలని విమర్శకులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫంక్షనరీ నుంచి ఫోన్ కాల్ వస్తే ఎలాగని ప్రశ్నించారు. లేదా అధికార పార్టీ ట్రోల్ ఆర్మీ రంగంలోకి దిగుతుందన్నారు. ఇలా చేస్తే విమర్శకులు తగ్గుతారని, అలా విమర్శకుల గొంతు నొక్కేస్తున్నారన్నారు. అందుకే చాలామంది గొంతెత్తడం లేదన్నారు. ఇలాగైతే ప్రభుత్వ విధానాలలో పొరపాట్లను లేవనెత్తడానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు.
ఇది ఎవరికీ లాభం కాదు
చారిత్రక అభివృద్ధి, విదేశీ విధానాలను ప్రభుత్వం వ్యతిరేకిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు. చరిత్రను అర్థం చేసుకోవడం మనకు ముఖ్యమని చెప్పారు. కానీ దానిని అడ్డం పెట్టుకొని మాట్లాడటం అభద్రతాభావానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి విధానాలు ఎవరికీ లాభం కాదన్నారు. ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తోందన్నారు.
సమస్యలు పరిష్కరించాలి..
ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కొత్త సంస్కరణలను తీసుకు వచ్చి ప్రైవేటు సెక్టార్లో పెట్టుబడులను ఆహ్వానించాలని చెప్పారు. కఠినమైన సత్యాన్ని ప్రభుత్వం గుర్తించగలిగి ఉండాలని చెప్పారు. ఈ రోజు మన ముందున్న అతిపెద్ద సమస్య ఆర్థిక రంగం ఇష్యూ కాదన్నారు.
2008 వంటి ఆర్థిక మాంద్యం వస్తుందా అంటే...
అదే సమయంలో 2008 కాలం నాటి ఆర్థిక మాంద్యం ముందు ఉందా అని ప్రశ్నించగా రఘురాం రాజన్ దీనిపై కూడా స్పందించారు. భారీ కుదుపు వస్తుందా అంటే.. తనకు తెలియదని, కానీ వేర్వేరు సోర్సెస్ నుంచి ప్రమాదం పొంచి ఉందని, పాత సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త సమస్యలను ఆపుతున్నట్లు కాదని పేర్కొన్నారు.