కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసాకు ఆదాయ పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయంలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో నోటీసుల్లో వివరణ కోరింది. నోవల్ గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని. 2005లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం 2015 -17 మధ్య కాలంలో పలు సంస్థలకు డైరెక్టర్గా ఉన్నారు. ఆ సమయంలో ఆమె సంపాదనపై సందేహాలు నెలకొన్నాయి.
ఆమె దాదాపు మూడు బోర్డుల్లో డైరెక్టర్గా ఉన్నారు. గత కొన్ని నెలలుగా నోవల్ ఆదాయంపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఐటీ రిటర్న్ దాఖలులో తేడాలు ఉండటాన్ని గమనించిన అధికారులు తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేశారు.

భారత ప్రభుత్వ సెక్రటరీగా ఎన్నికల కమిషనర్ లవాసా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భార్య నోవల్ సింఘాల్ పలు కంపెనీలకు ఇండిపెండెంట్ డైరెక్టర్ అయ్యారని చెబుతున్నారు.
దీనిపై నోవల్ సింఘాల్ లావాసా స్పందిస్తూ... నేను చెల్లించాల్సిన అన్ని పన్నులను సక్రమంగా చెల్లించానని వెల్లడించారు. పెన్షన్ సంపాదనను, ఇతర ఆదాయాలను ట్యాక్స్ చట్టం ప్రకారం వెల్లడించానని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ఎన్నికల అధికారిగా అశోక్ లావాసా 2018 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, నాటి బీజేపీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత హోమ్ మంత్రి అమిత్ షా వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలపై ఫిర్యాదులు అందగా, వారికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని లావాసా వ్యతిరేకించారు. అంతేగాక మోడల్ కండక్ట్పై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, మరో అధికారి సశీల్ చంద్రతో విభేదించారు.


Click it and Unblock the Notifications