చదువు కంటే అనుభవం, అవగాహన ముఖ్యం: ఆర్బీఐ గవర్నర్ దాస్
ముంబై: 35 ఏళ్లు లేదా 45 ఏళ్లు సంవత్సరాల క్రితం నేర్చుకున్న దాని కంటే అవగాహన, అనుభవం చాలా ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉర్జీత్ పటేల్ రాజీనామాతో 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్లుగా పని చేసిన ఉర్జీత్ పటేల్, రఘురామ్ రాజన్లతో విద్యార్హతలతో పోలిస్తే శక్తికాంత దాస్ విద్యార్హతలు తక్కువ. ఈ నేపథ్యంలో ఇండియా టుడే సదస్సులో ఆయన ఈ అంశంపై ప్రశ్న రాగా స్పందించారు.
మూడున్నర దశాబ్దాల క్రితం సంపాదించిన విద్యార్హతల కన్నా మొత్తం సెంట్రల్ బ్యాంకుల వంటి కీలక నియంత్రణ వ్యవస్థ సారథి కావడానికి ఆ వ్యక్తికి ఆర్థిక వ్యవహారాలపై ఉన్న పట్టు, సమకాలీన ఆర్థిక స్థితిగతులపై అవగాహన, అనుభవం ప్రధానమని శక్తికాంత దాస్ చెప్పారు.

ఆర్థిక శాస్త్రం అభ్యసించని వ్యక్తిని ఆర్బీఐ వంటి కీలక నియంత్రణ వ్యవస్థ సారథిగా నియమించడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అంశాలపై అవగాహన, వృత్తిపరమైన అనుభవాన్ని మంచిన అర్హత మరొకటి ఉండబోదన్నారు. ఆర్థికపరమైన విధాన నిర్ణయాల్లో ఎన్నో సంక్లిష్ట వాస్తవాలు ఇమిడి ఉంటాయని, దానికి అనుభవమే ప్రధానమన్నారు. ఆర్బీఐవద్ద అద్భుతమైన పరిశోధన బృందం ఉందని, వారి నుంచి అందే సాంకేతికాంశాలకు కొదవ లేదన్నారు.
35-40 సంవత్సరాల క్రితం చదువుకున్నది నేటి పరిస్థితులకు సరితూగదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా నడుచుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. విషయ పరిజ్ఞానం, ప్రస్తుత పరిణామాలపై అవగాహన లేకుంటే ఎంత చదువుకున్నా వ్యర్థమన్నారు. అనుభవమే గొప్పదన్నారు.
గత ఏడాది డిసెంబరులో ఉర్జిత్ పటేల్ రాజీనామాతో ఆకస్మికంగా చోటు చేసుకున్న పరిణామాల్లో శక్తికాంత దాస్కు ఆ పదవి కట్టబెట్టడంపై విమర్శలు వచ్చాయి. రఘురామ్ రాజన్ అంతర్జాతీయ ఆర్థికవేత్తగా, ఉర్జీత్ పటేల్ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ద్రవ్య విధాన అర్థ శాస్త్రాల్లో కోవిదుడిగా ప్రఖ్యాతిగాంచారు.


Click it and Unblock the Notifications