ఆటో, బిస్కట్కు జీఎస్టీ షాక్, హోటల్ రూమ్లకు గుడ్న్యూస్!
గోవా: 37వ జీఎస్టీ కౌన్సెల్ శుక్రవారం గోవాలో భేటీ అవుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు పాల్గొంటారు. ఆర్థికమంద గమనం, జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటో, టెలికం, ఎఫ్ఎంసీజీ, సహా అన్ని రంగాలు జీఎస్టీ భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ సమావేశంలో వివిధ రంగాల జీఎస్టీ తగ్గింపు పైన చర్చ జరగనుంది. అయితే హోటల్ రంగం వంటి కొన్ని మినహాయింపులు తప్ప పెద్దగా ఊరటలు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
రూ.2,300 తగ్గిన బంగారం ధర, రూ.5,000 తగ్గిన వెండి ధర!
హోటల్ రూమ్స్ తగ్గించాలని గోవా డిమాండ్
హోటల్ రూమ్ టారిఫ్ పైన జీఎస్టీ తగ్గించాలని గోవా ప్రభుత్వం జీఎస్టీ కౌన్సెల్ను డిమాండ్ చేసే అవకాశముంది. భారత్లో ఈ రూమ్లపై టారిఫ్ 18 శాతం నుంచి 28 శాతం ఉన్నాయి. వీటిని తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. గోవాలో 20,000కు పైగా రెంటల్ హోటల్ రూమ్స్ ఉన్నాయి. గోవా ప్రధానంగా టూరిస్టులపై ఆధారపడిందని, ఈ నేపథ్యంలో అధిక జీఎస్టీ భారమవుతోందని చెబుతున్నారు.
హోటల్స్కు 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి
ట్రావెల్ అండ్ టూరిజం అసోసియేషన్ ఆఫ్ గోవా (TTAG) కూడా కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి జీఎస్టీ రేట్లు తగ్గించాలని కోరింది. TTAG సెక్రటరీ జాక్ సుఖిజా మాట్లాడుతూ... మలేషియా, సింగపూర్ వంటి సౌత్ ఏసియా దేశాల్లో హోటల్స్కు ప్రత్యేక జీఎస్టీ ఉంటుందని, పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా చూస్తారని చెప్పారు. ఇన్-హౌస్ రెస్టారెంట్స్ పైన జీఎస్టీ 18 శాతంగా ఉందని, దీనిని 5 శాతానికి తగ్గించాలని కోరారు. ప్రస్తుతం రూ.7500 వరకు హోటల్ గది రోజువారీ అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఈ శ్లాబ్ పరిధిని రూ.12,000కు పెంచాలని కోరుతున్నారు.
ఆటోపై జీఎస్టీ తగ్గిస్తే రూ.45,000 కోట్ల నష్టం
ఆటో ఇండస్ట్రీపై జీఎస్టీ తగ్గించాలని ఈ రంగం డిమాండ్ చేస్తోంది. అయితే ఇలా తగ్గిస్తే కేంద్రానికి రెవెన్యూ రూ.45,000 కోట్లు తగ్గుతుందని అంచనా. ఇదే విషయాన్ని బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీ కూడా చెప్పారు. ఆటో రంగానికి రేట్ కట్ను జీఎస్టీ కౌన్సెల్ తిరస్కరించింది. దీని వల్ల రూ.40,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం వస్తుందని సుశీల్ కుమార్ మోడీ అన్నారు.
రూ.60,000 కోట్ల వరకు వాహన విక్రయాల ద్వారా రెవెన్యూ
గత కొద్ది కాలంగా వాహన సేల్స్ భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీని తగ్గించాలని ఆటో రంగం కోరుతోంది. అయితే మొత్తం జీఎస్టీ వసూళ్లలో రూ.60,000 కోట్ల వరకు వాహన విక్రయాల ద్వారానే వస్తోందని, ఇప్పుడు జీఎస్టీ రేటును తగ్గిస్తే రెవెన్యూ బాగా తగ్గిపోతుందని ఫిట్మెంట్ కమిటీ అభిప్రాయపడింది.
బిస్కట్ కంపెనీలకు లేని ఊరట
టెలికం సేవలకు జీఎస్టీ రేటు తగ్గించాలని, ఇప్పుడున్న 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలన్న టెలికం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను, క్రూయిజ్ టిక్కెట్ల విక్రయంపై జీఎస్టీ రేటు తగ్గింపు ప్రతిపాదనను కూడా జీఎస్టీ కౌన్సెల్ తిరస్కరించిందని తెలుస్తోంది. బిస్కట్ కంపెనీలు కూడా జీఎస్టీ తగ్గించాలని కోరగా, దానిని కూడా ఫిట్మెంట్ కమిటీ తిరస్కరించింది. ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ సవరణలను ఫిట్మెంట్ కమిటీ సిఫార్స్ చేస్తుంది.
ప్రధానంగా చర్చించే అంశాలు...
- ఇటుక బట్టీలు, ఇసుక తవ్వకం, స్టోన్ క్రషర్స్ కోసం ప్రత్యేక కాంపొజిషన్ స్కీం.
- కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడక్లకు చోటు కల్పించేందుకు జీఎస్టీ చట్ట సవరణ
- బంగారం, వజ్రాలు, రత్నాల రవాణా కోసం ఈ-వే బిల్లు ప్రవేశపెట్టడం
- జీఎస్టీ నమోదును ఆధార్కు అనుసంధానించడం.
- 18 శాతం జీఎస్టీ వర్తించే హోటల్ రూమ్స్ రోజువారీ టారిఫ్ను రూ.7,500 నుంచి రూ.12,000కు పెంచుట