ముఖేష్ అంబానీ సతీమణి నీతా, సంతానానికి ఐటీ శాఖ నోటీసులు?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబంలోని నలుగురికి ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ముంబై యూనిట్ నోటీసులు పంపించిందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ముఖేష్ సతీమణి నీతా అంబానీ, ముగ్గురు పిల్లలకి నోటీసులు పంపించారట. 2015 బ్లాక్ మనీ యాక్ట్ కింద ఈ నోటీసులను ఈ ఏడాది మార్చి 28వ తేదీన జారీ చేశారని అంటున్నారు.
తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి
ముఖేష్ కుటుంబంలోని నలుగురికి నోటీసులు
మీడియాలో వస్తున్న వార్తల మేరకు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో పాటు వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు ఐటి డిపార్టుమెంట్ నోటీసులు ఇచ్చిందట. వివిధ దేశాల నుంచి వచ్చిన సమాచారంపై దర్యాఫ్తు జరిపిన తర్వాత ఆదాయ పన్ను శాఖ వీరికి నోటీసులు పంపించిందట. అనంత్, ఆకాష్, ఇషా, నీతా అంబానీలు వివిధ దేశాల్లోని విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదట.
స్విస్ లీక్స్...
హెచ్ఎస్బీసీ జెనీవాలో 700 మందికి పైగా భారతీయులు లేదా భారతీయ కంపెనీలకు ఖాతాలు ఉన్న వారి వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. వీటి ఆధారంగా ఐటీ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. స్విస్ లీక్స్గా వ్యవహరించే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్ (ఫిబ్రవరి 2015) హెచ్ఎస్బీసీ జెనీవా బ్యాంకు అకౌంట్ హోల్డర్ల సంఖ్య 1195గా పేర్కొంది.
సంబంధాలు...
601 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4200 కోట్లు) బ్యాలెన్సుతో 14 హెచ్ఎస్బీసీ జెనీవా బ్యాంకు అకౌంట్స్ క్లస్టర్ను ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ఇవన్నీ మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ ఆర్ఐఎల్ గ్రూప్తో అనుసంధానించబడ్డాయని తెలిపింది. ఈ పద్నాలుగు కంపెనీల్లో ఒక దానిలో అంతిమ లబ్ధిదారులుగా వారి కుటుంబం పేర్లు ఉన్నాయని, వివిధ దేశీయ, విదేశీ సంస్థల ద్వారా ఈ సంస్థల్లో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటీ డిపార్టుమెంట్ నివేదిక వెల్లడించిందట.
రిలయన్స్ ఖండన
ఈ మేరకు 4, ఫిబ్రవరి 2019 తేదీతో ఐటీ డిపార్టుమెంట్ మార్చి 28, 2019న నోటీసులు పంపించిందట. అయితే నోటీసుల ఆరోపణలను రిలయన్స్ ప్రతినిధులు ఖండించారు. ఐటీ శాఖ తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పేర్కొంది.