సౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి, ధరలపై ప్రభావం
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేసిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆరామ్కో ప్రకటించింది. అన్ని విభాగాలతో పాటు ప్రభుత్వం సకాలంలో స్పందించిందని, దీంతో పెను ముప్పు తప్పిందని కంపెనీ చీఫ్ అమిన్ నాసర్ తెలిపారు.
ఈ దాడి వల్ల భారీగా చమురు శుద్ధి ప్రక్రియ నిలిచిపోయినట్లు చెప్పారు. దాదాపు సగానికి పైగా ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఆగిపోయినట్లుగా వెల్లడించారు. ప్రపంచ చమురు ఎగుమతుల్లో ఇది 5 శాతం కావడం గమనార్హం. దీంతో చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. రోజువారీ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి
ఇదిలా ఉండగా సౌదీ అరేబియాపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక మీడియా పేర్కొంది. సౌదీ యువరాజుతో అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎలాంటి సహకారానికైనా సిద్ధమని చెప్పారు. ఈ చమురు దాడులకు అమెరికా.. ఇరాన్పై విమర్శలు గుప్పిస్తోంది.
కాగా, సౌదీ అరేబియాపై యెమన్ తిరుగుబాటుదారులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. అబ్కైక్, ఖురైస్లో ప్రభుత్వ కంపెనీ అయిన ఆరామ్కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడులు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య నెలకొన్న విభేదాలే ఈ దాడులకు కారణంగా భావిస్తున్నారు.
హుతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోంది. ఈ దాడికి అవసరమైన మానవరహిత డ్రోన్లను సరఫరా చేసింది కూడా ఇరానేనని భావిస్తున్నారు. ఇరాన్ సహకారం, అది అందిస్తున్న అధునాతన ఆయుధాలతో తిరుగుబాటుదారులు యెమన్ రాజధాని సనాతోపాటు పేద అరబ్ దేశాల్లోని మరికొన్ని ప్రాంతాల్ని సొంతం చేసుకున్నారు.