తెలంగాణ బడ్జెట్: తగ్గిన ఆదాయం, ఈ ఆరు నెలలు సవాలే
హైదరాబాద్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (9-9-2019) పూర్తిస్థాయి బట్జెట్ను ప్రవేశపెడుతోంది. మధ్యాహ్నం గం.11.30కు ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెడతారు. ఆర్థికమంత్రి హరీష్ రావు దీనిని మండలిల్లో ప్రతిపాదిస్తారు. మార్చి నెలలో ఆరు నెలల కాలానికి ఆమోదం పొందిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన ఈ బడ్జెట్కు ఉభయసభలు ఆమోదం తెలపనున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం, తగ్గుతున్న కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా, పతనమైన దేశ జీడీపీ వృద్ధిరేటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేశారు. ఆర్థిక వృద్ధి రేటుపై మాంద్యం ప్రభావం నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ కంటే కొంతమేర అంచనాలను తగ్గించినట్లుగా తెలుస్తోంది. మార్చిలో మొత్తం రూ.1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పూర్తి బడ్జెట్లో ఈ మొత్తాన్ని కుదించవచ్చని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం సొంత రాబడులలో సగటున 17% నుంచి 19% వృద్ధిరేటును సాధిస్తూ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. ఈసారి ఆర్థిక మాంద్యం నీలినీడలు అన్ని రాష్ట్రాలపై పడ్డాయి. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. రవాణా రంగంలో రాబడి తగ్గడంతో పాటు జీఎస్టీ, వ్యాట్ పన్నుల రాబడి వృద్ధి రేటులోను తగ్గుదల ఉంది. ఖజానాకు కీలకమైన అమ్మకం పన్ను రాబడులు తగ్గాయి. జీఎస్టీ రాబడుల్లో సగటున ఏటా 17 శాతం వృద్ధి రేటు ఉండగా ఈసారి 12-14 శాతం మాత్రమే ఉంది. పెట్రోల్, మద్యం అమ్మకాల ఆదాయం కూడా ఆరు నెలల కాలంలో తగ్గవచ్చనే అంచనా.
అక్టోబర్ నుంచి రానున్న ఆర్నెళ్లు వ్యయ కాలమే. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు కీలకమైన పథకాలకు భారీగా ఖర్చు చేయాలి. రైతు బంధుకు రూ.12వేల కోట్లు అవసరమని అంచనా వేయగా ఇప్పటి వరకు చెల్లించింది రూ.3500 కోట్లు మాత్రమే. రైతు రుణమాఫీని అమలు చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి భారీ మొత్తంలో నిధులు అవసరం. ఉద్యోగులకు ఫిట్మెంట్ అమలు చేయాలి. గ్రామీణాభివృద్ధికి అయిదేళ్లలో రూ.40వేల కోట్ల వ్య్యం చేయనుంది.


Click it and Unblock the Notifications