గుడ్ న్యూస్: మ్యూచువల్ ఫండ్స్ లో జోరుగా ఉద్యోగాలు !
మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టిపెట్టాయి. పెద్ద పట్టణాల నుంచి చిన్నపట్టణాలకు విస్తరించడానికి ఈ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విస్తరణ అనుకున్నంత సులభమేమీ కాదు. తమ కార్యాలయాలను ఏర్పరచుకోవడంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచుతున్నాయి. మార్కెటింగ్ కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి.
ఇక నియామకాల విషయానికి వస్తే గత ఆర్ధిక సంవత్సరం (2018-19) మ్యూచువల్ పరిశ్రమలో ఉద్యోగుల సంఖ్య 28 శాతం పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహనా బాగా పెరిగిపోతోంది. తామే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నందువల్ల ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దేశీయంగా ఫైనాన్సియల్ మార్కెట్లు బలహీనంగా నే ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తెస్తున్న ఉత్పత్తులు ఇన్వెసర్లను ఆకట్టుకుంటున్నాయి.

చిన్న పట్టణాలవైపు
* చిన్న పట్టణాలకు విస్తరించడంవల్ల వ్యాపారం పెరుగుతున్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీని మూలంగానే సిబ్బంది అవసరం పెరిగింది.
* అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామకాలు గత ఆర్ధిక సంవత్సరంతో పీల్చితే తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
* గత ఆర్ధిక సంవత్సరంలో ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సిబ్బంది సంఖ్యను 62 శాతం పెంచుకుంది. దీంతో సిబ్బంది సంఖ్య 2,100కు పెరిగింది.
* హెచ్ డీ ఎఫ్ సి ఏ ఎం సి ఉద్యోగుల సంఖ్య 25 శాతం పెరిగి 1,600కు చేరింది.

రిలయన్స్ నిప్పాన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్
* రిలయన్స్ నిప్పాన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఉద్యోగుల సంఖ్య 26 శాతం పెరిగి 1,700కు, యూఎస్ బీ ఐ మ్యూచువల్ ఫండ్ సిబ్బంది సంఖ్య 31 శాతం పెరిగి 1700కు చేరుకుంది.
* ఈ కంపెనీలు ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలను కూడా ఇస్తున్నాయి.
* గత ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ వేతనాల పెంపుదల 8 శాతం నుంచి 12 శాతం వరకు ఉంది. బోనస్ తో పాటు మార్కెట్ తో అనుసంధానమైన ఇంక్రిమెంట్ 20-30 శాతంగా ఉంది.

ఇన్వెస్టర్లు ఇంకా తక్కువే...
* దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ సంఖ్య ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది.
* మన దేశ జనాభా 130 కోట్లకు పైగా ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్ల సంఖ్య రెండు కోట్ల స్థాయిలోనే ఉంది.
* ప్రస్తుతం ఈ పరిశ్రమ నిర్వహణలో ఆస్తులు (ఏ యు ఎం) రూ. 25 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. వచ్చే దశాబ్ద కాలంలో ఏ యూ ఎం ను రూ. 100 లక్షల కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో పరిశ్రమ ఉంది.
* అంతే కాకుండా ఇన్వెస్టర్ల సంఖ్యను 2 కోట్లనుంచి 10 కోట్లకు పెంచుకోవాలనుకుంటున్నారు.
* 2016-17 ఆర్ధిక సంవత్సరంలో క్రమానుగత పెట్టుబడి ప్లాన్ (సిప్) ద్వారా వ్యక్తిగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.44,000 కోట్లు ఉండగా 2018-19 సంవత్సరంలో రూ. 93,000 కోట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications