అకౌంట్లోకి డబ్బు ట్రాన్సుఫర్కు మీ పర్మిషన్ అవసరమే, కానీ ఉచితం కాదు!
2016లో నోట్లరద్దు సమయంలో పలువురి ఖాతాల్లో వారికి తెలియకుండా.. అక్రమంగా నగదు చేరినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నల్లధనాన్ని చట్టబద్దంగా మార్చుకోవడానికి జన్ ధన్ ఖాతాలను ఎక్కువగా వినియోగించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఖాతాదారులకు తెలియకుండానే అమౌంట్ పడిపోయింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఖాతాదారులకు తెలియకుండా వారి అకౌంట్లో డబ్బులు వేయలేని నిబంధనలు తీసుకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్లో తెలిపారు. ఈ మేరకు తాజాగా ఈ అంశంపై ఆర్బీఐకి లేఖ రాశారు.
రూ.40,000కు సమీపంలో బంగారం, కొనుగోలు చేసినా నష్టం లేదా?
ట్రాన్సాక్షన్ అనుమతి/తిరస్కరణ
ఎవరి అకౌంట్లోనైనా అమౌంట్ క్రెడిట్ అయితే వారికి తెలిసి జరగాలని, తమ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ తిరస్కరించాలా లేదా అనుమతించాలా హక్కు అకౌంట్ హోల్డర్ కలిగి ఉండేలా నిబంధనలు ఉండాలని, దీనిపై అభిప్రాయం తెలపాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయాన్ని కోరింది.
అధికారి ఏం చెప్పారంటే...
నూతన విధానంలో ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తామని, వారు అనుమతిస్తే డబ్బులు డిపాజిట్ అవుతాయని ఈ అంశంతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. లావాదేవీని అనుమతించడం/తిరస్కరించడం ఖాతాదారుడి అభీష్టానికే వదిలేయబడుతుందన్నారు.
అందరికీ అందుబాటులోకి రాదా?
కేంద్రం అడుగుల నేపథ్యంలో ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ వేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి తీసుకునే విధానం త్వరలో బ్యాంకులు తీసుకు రానున్నాయని అర్థమవుతోంది. అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సేవలు పొందేందుకు బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ఖాతాదారుడికి తన అకౌంట్కు సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నియంత్రణ లేదు. కేవలం అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉంటే జమ చేయవచ్చు.