అనిల్ అంబానీకి మరో దెబ్బ, 2 కంపెనీల నుంచి ఆడిటర్లు ఔట్
ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మరో షాక్. వ్యాపారంలో నష్టం, దీంతో రుణాల చెల్లింపుల కోసం ఆయన వరుసగా ఆస్తులు, కంపెనీలలో షేర్లు విక్రయిస్తున్నారు. తాజాగా ఆయనకు ఆడిటర్లు దూరమయ్యారు. అనిల్ కంపెనీలైన రిలయన్స్ పవర్ (RPower), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (RInfra)లకు చెందిన ఆడిటర్లు రిజైన్ చేశారు. ఇది ఆయనకు మరో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

నాలుగుకు చేరిన అనిల్ కంపెనీల సంఖ్య
అనిల్ అంబానీకి ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో గత మూడు నెలలుగా చట్టబద్దమైన ఆడిటర్లు వైదొలుగుతున్నారు. తాజాగా మరో రెండు కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేయడం ద్వారా... ఈ మూడు నెలల్లోనే అనిల్కు చెందిన రిలయన్స్ గ్రూప్లోని నాలుగు కంపెనీల ఆడిటర్లు వైదొలిగినట్లు అయింది.

స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపిన కంపెనీలు
ఈ మేరకు రిలయన్స్ ఇన్ఫ్రా శుక్రవారం స్టాక్ ఎక్స్చెంజ్కు వెల్లడించింది. కంపెనీకి చట్టబద్ధమైన ఆడిటర్లలో ఒకరైన BSR & Co LLP (BSR) 2019 ఆగస్ట్ 9వ తేదీ నుంచి వైదొలిగిందని పేర్కొంది. రిలయన్స్ పవర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆగస్ట్ 9వ తేదీ నుంచి BSR & Co ఆడిటర్ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు పేర్కొంది.

వైదొలగడానికి కారణాలు...
ఈ మేరకు BSR & Co తాము ఆడిటర్ బాధ్యతల నుంచి ఎందుకు వదులుకుంటున్నామో... కంపెనీలకు రాసిన లేఖలో వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 14వ తేదీన రిలయన్స్ ఇన్ఫ్రా ఆడిట్ నివేదికలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ పైన ఆందోళన వ్యక్తం చేసిందని, తమకు వివిధ అంశాలపై సరైన సమాచారం లభించలేదని పేర్కొంది. మూడు నెలల్లో ఇప్పటి వరకు ఆడిటర్లు వైదొలిగిన అనిల్ గ్రూప్కు చెందిన కంపెనీల సంఖ్య నాలుగు చేరడం గమనార్హం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ అంబానీని ఆయన అన్నయ్య, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ ఆదుకున్నారు. ఆ తర్వాత కూడా అప్పులు తీర్చేందుకు అనిల్ అంబానీ కంపెనీలను అమ్మకానికి పెడుతున్నారు.


Click it and Unblock the Notifications